రిజైన్ చేయండి: చిరుపై ఫైర్, సమైక్యాంధ్రవద్దని వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావుల పైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. రాజ్యసభ జరుగుతున్నప్పుడు చిరు, కావూరి, ఇతర సీమాంధ్ర ఎంపీలు నిరసనలు తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని జై సమైక్యాంధ్ర అంటూ నిరసన తెలిపారు.
దీనిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. మంత్రులుగా ఉండి నిరసన వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయవచ్చునన్నారు. జైట్లీ వ్యాఖ్యలను కురియన్ సమర్థించారు.
మంత్రులుగా ఉండి నిరసనలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. అవసరమైతే మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలుపుకోవచ్చునని సూచించారు. మంత్రులుగా ఉన్న వారు సమాధానం చెప్పేందుకే రావాలన్నారు.
సమైక్యాంధ్రకు వ్యతిరేకం
తాము సమైక్యాంధ్రకు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అన్నారు. ఎపిలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు.
గ్యాలరీలో కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజ్యసభను తిలకించేందుకు రాజ్యసభ గ్యాలరీలో కూర్చున్నారు.