కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు: బీజేపీ, కాంగ్రెస్ లెక్క!
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ, శాసన సభ ఎన్నికల వేడి మొదలైయ్యింది. కర్ణాటకలో శాసన సభ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాజ్యసభలో అడుగు పెట్టడానికి ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు లాభీలు మొదలు పెట్టారు. రాజ్యసభకు ముగ్గురిని పంపించాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీ నుంచి ఒక్కరు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. జేడీఎస్ నుంచి ఒక్కరు కూడా రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది.
Recommended Video
2012లో నలుగురు
కర్ణాటకలో 2012లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు రాజ్యసభలో అడుగుపెట్టారు. బసవరాజ్ పాటిల్ సేడం (బీజేపీ), ఆర్. రామకృష్ణ (బీజేపీ), కే. రెహమాన్ ఖాన్ (కాంగ్రెస్), ఎం. రాజీవ్ చంద్రశేఖర్ (స్వతంత్ర పార్టీ అభ్యర్థి)గా కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా వెళ్లారు.
మార్చిలో రాజ్యసభ ఎన్నికలు?
మార్చిలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక నుంచి మొత్తం నలుగురు రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. శాసన సభ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాలని కార్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
45 మంది ఎమ్మెల్యేలు
45 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే ఒక్కరు రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. 2012లో రాజ్యసభలో అడుగుపెట్టిన రెహమాన్ ఖాన్, రాజీవ్ చంద్రశేఖర్, బసవరాజ్ పాటిల్ సేడం, ఆర్. రామకృష్ణల పదవి కాలం ఏప్రిల్ 2వ తేదీతో పూర్తికానుంది.
కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్
జేడీఎస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. 7 మంది జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 25వ తేదీన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దం అయ్యారు. అయితే రాజ్యసభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత 7 మంది జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని కాగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది.
బీజేపీ నుంచి ఒక్కరు
జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో ఇప్పటికే చేరిపోయారు. బీజేపీ నుంచి రాజ్యసభలో ఒక్కరు మాత్రమే అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. రెండో అభ్యర్థిని రాజ్యసభకు పంపించాలంటే జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా కావాలి.
అయోమయంలో జేడీఎస్!
7 మంది కాంగ్రెస్ లోకి, ఇద్దరు బీజేపీలోకి జంప్ కావడంతో ప్రస్తుతం జేడీఎస్ ఎమ్మెల్యేల బలం 31కి పడిపోయింది. జేడీఎస్ నుంచి సొంతంగా ఒక్కరూ రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు జేడీఎస్ బీజేపీ లేదా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి లేదా తీసుకుని ఒకరిని రాజ్యసభకు పంపించాల్సి ఉంది.
వాయిదా వేయండి!
మాపార్టీ గుర్తుతో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు మద్దతు ఇవ్వకుండా చేయాలంటే శాసన సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేయ్యండి అంటూ జేడీఎస్ పార్టీ భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించడానికి సిద్దం అయ్యిందని తెలిసింది.