ముఫ్తీకి పూర్తి మద్దతు: సీఎం బాధ్యతలపై రాంమాధవ్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు రోజుల తర్వాత మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను విధించారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధావ్ శనివారం సమావేశమై సీఎం పదవి బాధ్యతలపై చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ముఫ్తీకి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ముఫ్తీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మెహబూబా సీఎం పదవి చేపట్టేందుకు బీజేపీ అధినాయకత్వం కూడా అంగీకారం తెలిపిందన్నారు.
కాగా, 2015లో పీడీపీ, బీజేపీ కూటమితో ముఫ్తీ మహ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో ఈ నెల 7న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై వైఖరి తెలపాలంటూ పీడీపీ, బీజేపీ అధ్యక్షులకు గవర్నర్ లేఖలు రాశారు.
దీంతో ముప్తీ సంతాప దినాల తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలని మెహబూబా ముఫ్తీ భావిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా మెహబూబా ముఫ్తీ ఉన్నారు. తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి కాబోతున్న మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారు.
న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మొదట్లో పార్టీ ఉపాధ్యక్షురాలిగా, చాన్నాళ్లనుంచి అధ్యక్షురాలిగా ఉన్న మెహబూబా ముప్తీ పార్టీకి సేవలందించారు.