జయ ఆప్తుడు : బినామీ పేరుతో దుబాయ్ లో రూ. 1,700 కోట్ల హోటల్ !
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీ. రామ్మోహన్ రావు కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులను ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ రావు పేరు మీద వేల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని అధికారులు గుర్తించారు.
అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపణలు రావడంతో గత బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు చెన్నైలోని రామ్మోహన్ రావు ఇంటి మీద దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన కుమారుడు వివేక్ రావు ఇంటి మీద దాడి చేసి సోదాలు చేశారు.
తమిళనాడు సెక్రటేరియట్ లోని రామ్మోహన్ రావు కార్యాలయంలో కూడా సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్లు, డైరీ స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ రావ్ ఇంటిలో సోదాలు చేసిన అధికారులు షాక్ కు గురైనారు.
వివేక్ రావు పేరు మీద దుబాయ్ లో రూ. 1,700 కోట్ల విలువైన విలాసవంతమైన హోటల్ ఉందని అధికారులు గుర్తించారు. ఆ హోటల్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేక్ రావు ఇంటిలో సోదాలు పూర్తి అయ్యాయని, డాక్యుమెంట్లు సీజ్ చేసి పరిశీలిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు.
జయలలిత ఎంతో నమ్మిన ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు ఇంత పెద్ద మొత్తంలో అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారని తెలుసుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంత మొత్తంలో అక్రమంగా ఆస్తులు సంపాదించారు ? అని ఐటీ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.