శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య పాకిస్తాన్లో ఉందట!
హైదరాబాద్: శ్రీరాముడి జన్మస్థలాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం ముందుకు వచ్చింది. రాముడి జన్మస్థలం అయోధ్య భారత్లో లేదని, అది పాకిస్తాన్లో ఉందని ఓ ముస్లిం నేత గ్రంథంలో రాశారు. 18 మిలియన్ల ఏళ్ల క్రితం జన్మించిన స్థలం ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాదులో అయోధ్యగా ప్రసిద్ధికి ఎక్కింది.
ఫ్యాక్ట్స్ ఆఫ్ అయోధ్య ఎపిసోడ్ పేరు మీద అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సహాయ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం ఖురేష్ తన పుస్తకంలో శ్రీరాముడు జన్మించిన అయోధ్య పాకిస్తాన్లో ఉందని వాదించారు.
జస్సూ రాము, అర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అర్కియోలిజిస్తుల పరిశోధనా పత్రాలను ఉటంకిస్తూ - రెండు అయోధ్యలున్నాయని, ఒకటి శ్రీరాముడి ముత్తాత రఘు నిర్మించింది కాగా, రెండో శ్రీరాముడు స్వయంగా నిర్మించిందని ఆయన చెప్పారు.
అన్సియంట్ జియోగ్రఫీ ఆఫ్ ద రామాయణలో జస్సూ రామ్ రెండు అయోధ్యలు కూడా పాకిస్తాన్లోని ప్రస్తుతం ఖైబర్ పఖ్తుఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఉన్నాయని చెప్పినట్లు ఖురేషీ వాదించారు.
ఫైజాబాద్లోని అయోధ్యను క్రీస్తుపూర్వం 7వ శతాబ్దిలో సాకేత్ అని పిలిచేవారని అన్నారు. బహుశా 11వ శతాబ్దం సిఇలో ఆ నగరానికి హిందువులు అయోధ్య అని నామకరణం చేసి ఉంటారని ఆయన అన్నారు. రామకథకు సంబంధం ఉండే విధంగా వివిధ ప్రాంతాలకు వారు పేర్లు పెట్టి ఉంటారని ఆయన అన్నారు.
ఒక వేళ ఇదే నిజమైన అయోధ్య అయి ఉంటే ముఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో రామాయణం రాసిన తులసీదాస్ అందులో ఆ విషయం చెప్పి ఉండేవాడని ఆయన అన్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును నిర్మించి ఉంటే కూడా ఆ విషయాన్ని తులసీదాస్ రాసి ఉండేవాడని ఆయన ఓ వార్తాసంస్థ ప్రతినిధితో అన్నారు.
బాబ్రీ విధ్వంసం కేసు విచారణ సందర్భంగా ఆ సాక్ష్యాలను తాను సుప్రీంకోర్టుకు సమర్పిస్తానని ఆయన చెప్పారు. బాబ్రీ మసీదు టైటిల్ స్యూట్పై అలాహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఖురేష్ ఉర్దూలో రాసిన ఆ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. దాని ఆంగ్లానువాదం కూడా ప్రచురించే ఉద్దేశంతో ఉన్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఎఎస్ఐ తవ్వకాల్లో అక్కడ ఆలయం ఉండేదని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన అన్నారు. 1528లో బాబ్రీ మసీదును నిర్మించినప్పుడు హిందువుల నుంచి అభ్యంతరం రాలేదని చెప్పారు. 1855 సంఘటనను ఉదహరిస్తూ కొన్ని రోజుల పాటు తమ స్వాధీనంలో ఉంచుకున్న బైరాగులు దాన్ని తిరిగి ముస్లింలకు ఇచ్చేశారని ఆయన చెప్పారు.