కర్ణాటక కేబినెట్ లో లుకలుకలు: రెడ్డిగారి అసంతృప్తి
కర్ణాటక మంత్రివర్గంలో అసమ్మతి సెగ మొదలైంది. కీలకమైన బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కలేదనే అసంతృప్తితో సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ నేడు ఆయన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పోర్ట్ ఫోలియో పట్ల స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో అత్యంత సీనియర్ రామలింగారెడ్డి. ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తనకు కేటాయించిన భారీ, మధ్య తరహా నీటిపారుదల మంత్రిత్వ శాఖను స్వీకరించడానికి విముఖత చూపుతున్నారు. బెంగళూరు అభివృద్ధి పోర్ట్ఫోలియోపై ఆయన గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మరే ఇతర మంత్రిత్వ శాఖను చేపట్టడానికి నిరాకరిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ అంశంపై ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆశించిన ఫలితం దక్కకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. "నేను అత్యంత సీనియర్ను, నాకు కోరుకున్న శాఖను ఇవ్వడంలో ఇబ్బందేముంది? గతంలోనూ నాకు సరైన పదవి దక్కలేదు. ఇప్పుడు జలవనరుల శాఖకు, నాకూ సంబంధమేముంది? ఇతర విషయాల్లో బెంగళూరులో నేను కావాలి, కానీ శాఖల కేటాయింపులో ఈ వివక్ష ఎందుకు?" అని ఆయన ప్రశ్నించగా.. దీనికి డీకే శివకుమార్ స్పందిస్తూ మల్లికార్జున ఖర్గే శాఖల మార్పునకు అంగీకరించడం లేదని తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన వద్ద ఆర్ధిక శాఖను ఉంచుకుని, గతంలో తాను నిర్వహించిన బెంగళూరు అభివృద్ధి బాధ్యతలను మరో సీనియర్ అయిన కృష్ణ బైరేగౌడకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖగా పరిగణించే బెంగళూరు అభివృద్ధి బాధ్యతను బైరేగౌడకు కేటాయించడంపై రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్పులు ప్రభుత్వంలో అంతర్గత కలహాలకు దారితీశాయి. రామలింగారెడ్డి బెంగళూరులోని బీటీఎం లేఅవుట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగళూరులోనే ఉన్న బ్యాటరాయనపుర నుంచి కృష్ణ బైరేగౌడ ఎన్నికయ్యారు. ఇద్దరికీ బెంగళూరు, అక్కడి మౌలిక సదుపాయాల కల్పనపై మంచి అవగాహన, గట్టి పట్టు ఉంది. అయినప్పటికీ.. ఈ శాఖ కేటాయింపులో డీకే శివకుమార్ బైరేగౌడ వైపే మొగ్గు చూపారు.
గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో రవాణా, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం రామలింగారెడ్డికి ఉంది. అంతేకాకుండా అంతకుముందు హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అటువంటి అనుభవం ఉన్న సీనియర్ నేతకు ప్రాధాన్యత తక్కువగా ఉండే శాఖను కేటాయించడంపై ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్య కేబినెట్ లో కూడా కృష్ణ బైరేగౌడ కీలకమైనరెవిన్యూ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దీన్ని ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వరకు కేటాయించారు.












Click it and Unblock the Notifications