తప్పు జరిగింది క్షమించండి: కంచి విజయేంద్ర సరస్వతి స్వామి, వదిలేయండి: బీజేపీ!
చెన్నై: తమిళనాడులోని కాంచీపురంలోని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి జీయర్ స్వామి క్షమాపణలు చెప్పినా ఆయన మీద తమిళ సంఘాల ఆగ్రహం చల్లారడం లేదు. తమిళ తల్లి గీతాన్నీ విజయేంద్ర సరస్వతి జీయర్ స్వామి అవమానించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కంచిలోని శంకర మఠం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం ఇంతటితో వదిలేయ్యాలని బీజేపీ మనవి చేసింది.

తమిళ తల్లి గీతం
తమిళ తల్లి గీతం ఆలాపిస్తున్నప్పుడు విజయేంద్ర సరస్వతి ధ్యానంలో ఉండి నిలబడలేకపోయారని, అది తమిళ భాషను అవమానించినట్టుగా భావించవద్దని శంకరమఠం మనవి చేసింది. అయితే జాతీయగీతం ఆలాపన సమయంలో గౌరవంగా లేచి నిలబడిన విజయేంద్ర సరస్వతి స్వామిజీ తమిళ తల్లి గీతాన్ని ఆలాపిస్తున్న సమయంలో లేచి నిలడకపోవడం అవమానించడమేనని పలు తమిళ సంఘాలు మండిపడుతున్నాయి.

విద్యార్థి సంఘాలు
కాంచీపురంలోని శంకర మఠం ముట్టడికి తమిళ విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ముందస్తు సమాచారం లేకుండా విద్యార్థి సంఘాలు శంకర మఠం ముందు గుమికూడటంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఆధ్యాత్మిక కేంద్రం
కంచి శంకర మఠం ముందు పోలీసులు ఆందోళనకారుల నడుమ తోపులాట జరిగింది. ఆధ్యాత్మికతకు నిలయమైన శంకర మఠం ముట్టడికి ప్రయత్నించడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్బంలో విజేంద్ర సరస్వతి స్వామిజీ వివరణ ఇచ్చుకున్నారు.

అవమానించలేదు
తాను కావాలని తమిళ తల్లి గీతాన్ని అవమానించలేదని విజయేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. తాను తమిళ తల్లిని అవమానించానని ఎవరైనా బావిస్తే తనను క్షమించాలని విజేంద్ర సరస్వతి మనవి చేశారు. తమిళనాడులో ఉంటూ తమిళ తల్లిని అవమానించే మనస్థత్వం తనకు లేదని విజేంద్ర సరస్వతి వివరణ ఇచ్చారు.

వదిలేయండి అంటున్న బీజేపీ
కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి క్షమాపణలు చెప్పారని, ఇక ఈ విషయం ఇంతటితో వదిలి పెట్టాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ తమిళ సంఘాలకు మనవి చేశారు. తప్పు జరిగిందని అంగీకరించిన తరువాత మళ్లీ ఈ విషయంలో రాద్దాంతం చెయ్యడం మంచిది కాదని తమిళసై సౌందరరాజన్ చెప్పారు.












Click it and Unblock the Notifications