కుట్రకు బలై.. మీడియాకు భయపడుతూ..: ఏడుస్తూ రామ్మోహన్ రావు భార్య!
మీడియా వాళ్లు కనబడితేనే భయంతో తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సతీమణి వాపోతున్నారు.
చెన్నై: ఓవైపు హీటెక్కుతోన్న అన్నాడీఎంకె రాజకీయాలు.. మరోవైపు మాజీ సీఎస్ రామ్మెహన్ రావు వివాదంతో తమిళనాట పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుమారుడి పేరిట సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి తన ఇంట్లో సోదాలు నిర్వహించారని రామ్మోహన్ రావు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. తొలిసారిగా ఆయన భార్య మీడియా ముందుకు వచ్చారు.
రామ్మోహన్ రావుపై ఐటీ దాడుల నేపథ్యంలో ఓ తెలుగు చానెల్ తో ఆమె మాట్లాడారు. తమ స్వస్థలాన్ని వదిలి మూడు దశాబ్దాల పాటు తమిళనాడుకు సేవ చేస్తుంటే, తనిఖీల పేరిట తనను తన బిడ్డలను రోడ్డు మీదకు లాగారని ఆమె ఆవేదన చెందారు.
మీడియా వాళ్లు కనబడితేనే భయంతో తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని అన్నారు. మున్ముందు తమ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి బాధ్యత ఎవరిదో కూడా అర్థం కావడం లేదని అన్నారు.
బోరున విలపిస్తూ..
తమ కుటుంబమంతా కుట్రకు బలైపోయిందని ఆరోపించిన రామ్మోహన్ రావు సతీమణి.. తన భర్త నిరపరాధని తెలిపారు. తమకు జరిగిన అవమానానికి మనిషినే చంపేసినంతగా బాధపడుతున్నామని పేర్కొంటూ బోరున విలపించారు. ఏం పాపం చేశామని.. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదన్నారు.
కుట్రను తట్టుకోలేకే రామ్మోహన్ రావు గుండెపోటుకు గురయ్యారని చెప్పారు. తాము నివసిస్తున్న వీధిలో కూడా తానెవరో ఇంతవరకు ఎవరికీ తెలియదని, అలాంటిది ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చిందని, తమ కుటుంబాన్ని ఎందుకింతలా వేధిస్తున్నారో తెలియడం లేదని చెబుతూ రామ్మోహన్ రావు సతీమణి కన్నీళ్లు పెట్టుకున్నారు.