మీ సంగతేంటి సర్?: మోడీపై రమ్యకు కోపమొచ్చింది
బెంగళూరు: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన మాండ్య కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి, ప్రముఖ నటి రమ్యకు కోపం వచ్చింది. మోడీ పైన రమ్య విరుచుకు పడటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. ఎన్నికల్లో మీ అజెండా ఏమిటని మోడీని రమ్య ప్రశ్నించారు.
రమ్య మాండ్య లోకసభ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా విపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోడీ పైన ఆమె సెటైర్ వేశారు. మోడీలో ఓ నైపుణ్యం అద్భుతమని, ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు.
ఆ తర్వాత మోడీ పైన ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. కాంగ్రెసు పార్టీ రాహుల్ గాంధీ ఫ్యూచర్ అనే సింగిల్ అజెండాతో ముందుకు పోతోందని మోడీ చెబుతున్నారని... అయితే మీ సంగతేమిటని ఆమె ట్వీట్ చేశారు.
తాను ఇటీవల అహ్మదాబాదుకు వెళ్లానని, అక్కడ మోడీ చెబుతున్న అభివృద్ధి కనిపించ లేదని ఆమె అన్నారు. అహ్మదాబాదులో పట్టణాభివృద్ధి కనిపించినప్పటికీ.. హ్యూమన్ డెవలప్ మెంట్ మాత్రం లేదన్నారు. కచ్చితమైన లెక్కలు తీస్తే.. గుజరాత్ అభివృద్ధి కర్నాటక కంటే కింద ఉంటుందన్నారు. గుజరాత్ కంటే హర్యానా బాగా అభివృద్ధి చెందిందన్నారు.