320 గంటల నిఘా.. అరుదైన కొంగల ప్రపంచం బయటపడింది ఇలా!
గుజరాత్లోని అత్యంత ప్రసిద్ధ రామ్సార్ ప్రదేశమైన 'ఖిజడియా పక్షుల అభయారణ్యం' పర్యావరణ ప్రేమికులకు ఒక అద్భుతమైన వార్తను అందించింది. భారత్లోనే అత్యంత పెద్దవి, ప్రత్యేకమైనవిగా పేరొందిన 'నల్ల మెడ కొంగలు' తమ సంతానోత్పత్తికి ఈ అభయారణ్యాన్ని సురక్షిత స్థావరంగా మలుచుకున్నట్లు ఒక నూతన పరిశోధనలో వెల్లడైంది. పర్యావరణ విద్యా పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు జరిపిన ఈ సమగ్ర అధ్యయనం, ఈ అరుదైన పక్షుల జీవన విధానం, పిల్లల పెంపకంలో అవి చూపే ప్రేమను ప్రపంచానికి చాటిచెప్పింది.
ఖిజడియా అభయారణ్యంలో జూలై 2024 నుంచి మార్చి 2025 మధ్య కాలంలో నిర్వహించిన ఈ రీసెర్చ్లో పరిశోధకులు 320 గంటలకు పైగా సమయాన్ని వెచ్చించి పక్షుల ప్రవర్తనను రికార్డ్ చేశారు. అధ్యయనం ముగిసే సమయానికి గుర్తించిన నాలుగు కొంగల గూళ్లలోనూ ప్రతి జంట రెండు పిల్లల చొప్పున మొత్తం 8 కొత్త పిల్లలకు జన్మనిచ్చాయి. సాధారణంగా పక్షుల గూళ్లపై ఇతర క్రూర జంతువుల దాడి లేదా పిల్లలు చనిపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా 100 శాతం ప్రాణరక్షణతో పిల్లలు పెరగడం అంతర్జాతీయ స్థాయిలో ఒక విశేష రికార్డుగా నిలిచింది.

అనుకూలతలో తోపులు: ముళ్ల చెట్లపైనా గూళ్ల నిర్మాణం!
సాధారణంగా నల్ల మెడ కొంగలు మర్రి, రావి లేదా పెద్ద పెద్ద దేశవాళీ వృక్షాలపై మాత్రమే గూళ్లు కడతాయి. కానీ ఖిజడియాలో పెద్ద చెట్లు లభించకపోవడంతో, ఆ పక్షులు 'గాండో బావల్' (ముళ్ల చెట్లు) పై 3 నుంచి 4.5 మీటర్ల ఎత్తులో గూళ్లను ఏర్పాటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మారుతున్న వాతావరణానికి, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడంలో ఈ పక్షులు ప్రదర్శించిన చాకచక్యం పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచింది.
తల్లిదండ్రుల బాధ్యత.. క్షణం కూడా ఖాళీ ఉండదు!
ఈ పక్షుల సంతానోత్పత్తి విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జంటగా మారే ఈ కొంగలు, అక్టోబర్లో గూళ్లు కట్టి గుడ్లు పెడతాయి. పిల్లలు పుట్టిన తర్వాత తల్లి, తండ్రి కొంగలు కలిసికట్టుగా పెంపకం బాధ్యతలు తీసుకుంటాయి. ఒక పక్షి ఆహారం కోసం బయటకు వెళ్తే, మరో పక్షి గూడు వద్ద కావలి ఉంటుంది. పరిశోధకులు పరిశీలించిన సమయంలో 94 శాతం సార్లు ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా కాపలా కాస్తూ, పిల్లలను క్షణం కూడా వదలకుండా కాపాడుకున్నట్లు తేలింది.
మంచి ఆహారం.. ప్రశాంతమైన వాతావరణం!
ఈ పక్షుల విజయవంతమైన వృద్ధికి అక్కడ ఉన్న అనుకూల పర్యావరణమే కారణం. నీటి లోతు తక్కువగా ఉండటం వల్ల చేపలు, కప్పలు, నీటి జీవులు వీటికి పుష్కలంగా ఆహారంగా లభిస్తున్నాయి. అంతేకాకుండా, మనుషుల రాకపోకలు లేని ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో ఇక్కడ కొంగల జనాభా సంఖ్య 21కి చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్-II పరిధిలోకి వచ్చే ఈ కొంగల పరిరక్షణకు, ఖిజడియా అభయారణ్యంలో అమలు చేస్తున్న సంరక్షణ చర్యలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అటవీ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications