Cheetah: కునోలో కొత్త ‘బ్రదర్స్’! మరో నాలుగు చిన్నారి చిరుతల జననం
మధ్యప్రదేశ్ పరిధిలోని కునో నేషనల్ పార్కులో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. సాధారణంగా ఒకే తల్లి కడుపున పుట్టిన మగ చిరుతలు మాత్రమే జతకట్టి, కలిసి వేటాడుతూ సామ్రాజ్యాన్ని ఏలుతాయి. కానీ, ఇందుకు పూర్తి భిన్నంగా ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి వచ్చిన ఒక చిరుత, భారతదేశంలో పుట్టిన మరో చిరుత మధ్య ఊహించని బంధం ఏర్పడింది. రెండు వేర్వేరు ఖండాలకు చెందిన ఈ మగ చిరుతలు ఇప్పుడు ప్రాణస్నేహితులుగా మారిపోయాయి. అభయారణ్యంలో కలిసి తిరుగుతూ, వేటాడిన ఆహారాన్ని సమానంగా పంచుకుంటూ, ఒకరికొకరు తోడుగా నిలుస్తున్న తీరు వన్యప్రాణి అధికారులను సంతోషంలో ముంచెత్తుతోంది.
గాయాలు కలిపిన అనుబంధం!
ఈ రెండు అరుదైన మగ చిరుతల్లో 'KNG23' మార్చి నెలలో ఇక్కడే పుట్టగా, 'CCB4' మాత్రం బోట్స్వానా నుంచి భారత్కు వచ్చింది. వేర్వేరు కారణాల వల్ల ఇవి తమ కుటుంబాలకు దూరమై ఎన్క్లోజర్లో ఒకదానికొకటి దగ్గరయ్యాయి. మొదట్లో వేటను పంచుకోవడంతో మొదలైన ఈ పరిచయం, ఆ తర్వాత గాఢమైన స్నేహంగా మారింది. ఒకదానిని మరొకటి చూసుకోకపోతే అరుచుకోవడం, కలిసి ప్రయాణించడం, శత్రువుల నుంచి రక్షణ పొందేందుకు ఒకరికొకరు అండగా నిలవడం చూస్తుంటే ఇవి కేవలం కలసి జీవిస్తున్న రెండు జంతువులు కావు.. పక్కా ఒక 'టీమ్'లా మారిపోయాయని కునో అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

సవాలుగా మారనున్న అడవి జీవితం!
వయసు పెరిగే కొద్దీ వేర్వేరు కుటుంబాలకు చెందిన మగ చిరుతలు కలిసి ఉండటం దాదాపు అసాధ్యం. అయితే, ఈ చిన్న వయసులోనే ఇవి కలిసిపోవడం వల్ల ఈ జంట బంధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని పార్కు డైరెక్టర్ శర్మ తెలిపారు. ఐతే, ఇవి ఇంకా పూర్తిస్థాయిలో దట్టమైన అడవిలోకి విడుదల కాకపోవడం వల్ల, రేపటి రోజున ఆహారం, భూభాగం , ఆడ చిరుతల కోసం జరిగే పోరాటాల్లో ఈ స్నేహం ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాల్సి ఉంది. జతగా ఉంటే వేటాడటం సులువవ్వడమే కాకుండా, ఇతర శత్రు జీవుల నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నాలుగేళ్ల 'ప్రాజెక్ట్ చీతా'.. అద్భుత విజయాల దిశగా!
భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో కునో నుంచి మరొక తియ్యటి వార్త బయటకు వచ్చిందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోనే పుట్టిన 'KGP12' అనే ఆడ చిరుత ఇటీవల నాలుగు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ప్రస్తుతం కునో , గాంధీ సాగర్ పరిధిలో చిరుతల సంఖ్య 52కు చేరింది. ఇందులో 32 చిరుతలు భారత్లోనే జన్మించడం విశేషం. కేవలం సంఖ్య పెరగడమే కాకుండా, చిరుతలు తమ సహజ సిద్ధమైన ప్రవర్తనను ప్రదర్శిస్తూ సొంతంగా అడవిలో భూభాగాలను ఏర్పాటు చేసుకుంటుండటం, ప్రాజెక్ట్ సాధించిన అతిపెద్ద విజయంలో ఒకటని సంతోషం వ్యక్తం చేశారు.
A truly historic and joyous moment for Project Cheetah!
— Bhupender Yadav (@byadavbjp) September 18, 2026
A day after India's Cheetah Project completed four years, KGP12, an Indian-born female cheetah, has given birth to four cubs in Kuno.
Four years, four new lives—a beautiful symbol of hope, resilience and the growing… pic.twitter.com/f1zbqSvx1b














Click it and Unblock the Notifications
