ఎట్టకేలకు మౌనం వీడిన ఆర్బీఐ గవర్నర్: పెద్ద నోట్ల రద్దుపై ఇలా..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత నుంచి ఎలాంటి ప్రకటనా చేయని ఉర్జిత్ పటేల్.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు.
ముంబై: పెద్ద నోట్ల రద్దు అంశంపై ఎట్టకేలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనం వీడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత నుంచి ఎలాంటి ప్రకటనా చేయని ఉర్జిత్ పటేల్.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను రోజువారీగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
బ్యాంకుల్లో నగదు లభ్యత రోజురోజుకు పెరుగుతోందన్నారు. నగదు సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకులు నిరంతరాయంగా పనిచేస్తున్నాయనివివరించారు. నిజాయితీపరుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉందని, డిమాండ్కు అనుగుణంగా నోట్ల ముద్రణ జరుగుతోందని ఉర్జిత్పటేల్ వివరించారు. రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన తర్వాత ఉర్జిత్ పటేల్ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని విషయం తెలిసిందే.
చిల్లర సమస్యతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క సామాన్యుడు అల్లాడిపోతున్నా.. ఉర్జిత్ పటేల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.