మార్కెట్ల ఒడిదుడుకుల మధ్య నేడే ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయం
ముంబై: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) రేట్లను యథాతథంగా ఉండొచ్చన్న అంచనాల మధ్య రెండు రోజుల పరపతి విధాన సమీక్ష ప్రారంభమైంది. కాగా, బుధవారం మధ్యాహ్నం కీలక రేట్లపై ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) నిర్ణయాన్ని వెల్లడించనుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో భారీ విక్రయాల నేపథ్యంలో మన మార్కెట్లుకూడా మంగళవారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సమీక్ష కీలకంగా మారింది. డిసెంబర్ సమీక్షలో ఎంపీసీ ప్రామాణిక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.
అంతేగాక, భవిష్యత్ రేట్లకు తలుపులు తెరిచే ఉన్నాయని అప్పట్లో సంకేతాలు ఇచ్చింది. అయితే, డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం పెరగడం రిటైల్ ద్రవ్యోల్బణం 5.21శాతానికి చేరింది. నవంబరులో ఇది 4.88శాతం, డిసెంబర్ 2015లో 3.41శాతం మాత్రమే. కాగా, ఆగస్టులో ఆర్బీఐ ప్రామాణిక రుణరేటు(రెపో రేటు)ను 0.25శాతం తగ్గించి 6శాతానికి చేర్చిన విషయంతెలిసిందే.
తాజా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా మూడోసారీ ఆర్బీఐ రెపో రేటును మార్చకపోవచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడానికి తోడు, పంటలకు కనీస మద్దతు ధరను పెంచాలన్న ప్రభుత్వ ప్రణాళికల వల్ల ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు.