పీవోకేను సాధించేందుకు మేం రెడీ: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీఓకేసు సాధించడమే ఇక తమ ముందున్న లక్ష్యమని ఆయన వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.

మేం రెడీ..
ఈ నేపథ్యంలో రావత్ మాట్లాడుతూ.. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సైన్యం ఎల్లవేళలా సిద్ధంగానే ఉందని అన్నారు. ప్రభుత్వం ఆదేశం మేరకు దేశంలోని సంస్థలు పనిచేస్తాయన్నారు. పీవోకేను తిరిగి భారతదేశంలో కలిపేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని రావత్ స్పష్టం చేశారు.

అదో గొప్ప నిర్ణయం..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 రోజులపాలనపై ఇటీవల జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జితేంద్ర సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ 100 రోజుల పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారని, అందులో అధికరణ 370 రద్దు ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని ఆయన చెప్పారు. కాశ్మీర్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు.

పీవోకేనే మా టార్గెట్..
కాశ్మీర్పై తీసుకొన్న నిర్ణయంతో ఆ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరిగి భారీ స్థాయిలో యువతకు ఉద్యోగవకాశాలు లభిస్తాయని అన్నారు. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను భారత భూభాగంలో కలపడమే కేంద్ర ప్రభుత్వం తదుపరి ఎజెండా అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పీవీ నర్సింహారావు హయాంలోనే పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసని, వాటిని పరిష్కరించే దిశగా తమ పాలన కొనసాగుతోందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు.












Click it and Unblock the Notifications