Bihar news: బీహార్లో రియల్ క్రైమ్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు.. సినిమాకి తక్కువేమీ కాదు
Real crime thriller: థ్రిల్లర్ సినిమాను తలదన్నే స్టోరీ ఒకటి బీహార్లో జరిగింది. గతంలో భర్తలను మోసం చేసి పారిపోయిన భార్యలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బుతో ఉడాయించిన ఇల్లాలికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. వాటికి భిన్నంగా సాగిన ఈ కథ ప్రస్తుతం వైరల్గా మారింది. మహిళ, ఆమె తండ్రి చేసిన పనికి ఓ వ్యక్తి ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
బీహార్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసినందుకు అరెస్ట్ చేయబడ్డాడు. అయితే నాలుగేళ్ల అనంతరం సదరు మహిళ బతికే ఉందని తెలిసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ధర్మశీలా దేవి అనే వివాహిత భర్త పెట్టే బాధలను భరించలేక పుట్టింటికి తిరిగి వెళ్లింది. కొంత కాలానికి ఆమె తల్లి మరణించింది. దీంతో మహిళ తండ్రి ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

ఈ బాధలు తట్టుకోలేని ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. రైలు పట్టాలపై నడుస్తుండగా ఓ వ్యక్తి సకాలంలో అక్కడకు చేరుకుని ఆమెను కాపాడాడు. ఆ వ్యక్తినే వివాహం చేసుకుని అతడి ద్వారా ఇద్దరు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది. ఇంతలో తన కుమార్తె చనిపోయిందని నమ్మించిన ఆమె తండ్రి, మొదటి భర్త దీపక్ మరియు కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అక్టోబరు 31, 2020న సోన్ నది సమీపంలో క్లెయిమ్ చేయని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అది ధర్మశీలదిగా ఆమె తండ్రి గుర్తించాడు. అనంతరం శవపరీక్షలోనూ ఆ మృతదేహం సదరు మహిళదే అని నిర్ధారించబడింది. దీంతో హత్య ఆరోపణలపై దీపక్ను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల తర్వాత ఆమె సజీవంగా ఉన్నట్లు తెలియడంతో ఊహించని విషయం బయటపడింది.
తన తండ్రి తప్పుడు ఫిర్యాదు ఇచ్చి దీపక్పై FIR నమోదు చేయించాడని ఆమె అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. దీనికితోడు తన మొదటి భర్తను జైలుకు పంపించడానికి మరొక మహిళ మృతదేహాన్ని తనదిగా చూపినట్లు ఆరోపించింది. తన తండ్రి అనుచిత ప్రవర్తన తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో హత్య విచారణ ముగిసిందని, ధర్మశీల తన తండ్రిపై చేసిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications