అనవసర గందరగోళం: మత అసహనంపై సుప్రియ ఫైర్
న్యూఢిల్లీ: మత అసహనం అంటూ పలువురు సాహితీవేత్తలు అవార్డులను వెనక్కి ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సినీ నటి సుప్రీయా పాఠక్, శాస్త్రవేత్త జయంత్ నర్లికర్లు మత అసహనం అంటూ అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి తీరును తప్పుబట్టారు.
మత అసహనం అంటూ అనవసర గందరగోళం చేస్తున్నారని సుప్రియా పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయన్నారు. దేశంలో మత అసహనం ఉన్న మాట వాస్తవమేనని ఆమె చెప్పారు.
అయితే, కవులు, కళాకారులు అవార్డులను వెనక్కి ఇచ్చేయడం సమస్యకు ఏమాత్రం పరిష్కారం కాదన్నారు. సమస్యను మరింత పెద్దది చేయడమే అవుతుందన్నారు. సమస్యను పెద్దదిగా చేసేందుకు ఎవరూ ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు.

శాంతిభద్రతలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అకాడమీలది కాదని జయంత్ నర్లికర్ అన్నారు. కల్బుర్గీ హత్యను సాహిత్య అకాడమీ ఖండించవలసిందేనని చెప్పారు. అంతేకాదు,అవార్డు గ్రహీతలు కూడా తమ నిరసన వ్యక్తం చేయవలసిందేనని చెప్పారు.
కానీ, అవార్డులు తిరిగి ఇచ్చేయడం మాత్రం ఏమాత్రం సరికాదన్నారు. అవార్డు అన్నది ఎంతో అరుదుగా దక్కే గౌరవం అని చెప్పారు. తిరిగి ఇచ్చేయడం ద్వారా దాని గౌరవాన్ని తగ్గించకూడదని జయంత్ నర్లికర్ చెప్పారు. నర్లికర్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
కాగా, నటుడు అనిల్ కుమార్ మత అసహనంపై స్పందించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనేది ముఖ్యం కాదని, దేశంలో మత ఘర్షణలు కొత్త కాదన్నారు. దేశ ఐక్యతకు అందరూ కట్టుబడాలన్నారు. అవార్డులు వెనక్కివ్వడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications