జయలలిత కంటే కర్ణాటకతో కరుణానిధి క్లోజ్, సీఎంగా సంచలన నిర్ణయం, కావేరీ నీరు!
Recommended Video
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్, కలైజ్ఞర్ డాక్టర్ ఎం. కరుణానిధి కర్ణాటక రాజకీయ నాయకులతో సామరస్యంగానే సర్దుకుని వెళ్లారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో కర్ణాటకతో కావేరీ నీటి సమస్య, హోగానికల్ విషయంలో ఎప్పుడు గొడవలు, ఆందోళనలు జరిగేవి. అయితే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక సీఎంలతో కావేరీ నీటి విషయంలో సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్లారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2009లో సీఎంలుగా ఉన్న కరుణానిధి, యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తమిళ, కన్నడ సంఘాలు
దక్షిణ భారతదేశంలో మొదటిసారి కర్ణాటకలో బీఎస్. యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కావేరీ, హోగానికల్ విషయంలో తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. కర్ణాటకలో కన్నడ సంఘాలు, తమిళనాడులో తమిళ సంఘాలు రోజురోజుకు ఆందోళనలు ఎక్కువ చెయ్యడంతో రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
సంచలన నిర్ణయం
తమిళనాడులో కరుణానిధి, కర్ణాటకలో యడ్యూరప్ప సీఎంలుగా ఉన్న సమయంలో ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16వ శతాబ్ధంలోని కన్నడ మహాకవి సర్వజ్ఞ విగ్రహం చెన్నైలో, తమిళనాడులో ఎంతో పేరు ఉన్న మహాకవి తిరువళ్ళవర్ విగ్రహం బెంగళూరులో ఏర్పాటు చెయ్యాలని కరుణానిధి, యడ్యూరప్ప నిర్ణయించారు.
చెన్నై, బెంగళూరు
2009 ఆగస్టు 9వ తేదీన బెంగళూరులోని హలసూరులో తమిళ మహాకవి తిరువళ్లవర్ విగ్రహాన్ని అప్పట్లో సీఎంలుగా ఉన్న కరుణానిధి, యడ్యూరప్ప అవిష్కరించారు. 2009 ఆగస్టు 14వ తేదీ ( 5 రోజుల తరువాత) చెన్నైలో కన్నడ మహాకవి సర్వజ్ఞ విగ్రహాన్ని కరుణానిధి, యడ్యూరప్ప అవిష్కరించారు.
అశ్చర్యంలో నాయకులు
రెండు రాష్ట్రాల మధ్య కావేరీ నీటి పంపిణి విషయంలో గొడవలు జరుగుతున్న సమయంలో కరుణానిధి, యడ్యూరప్ప ఇలా ఇరు రాష్ట్రాల కవులు విగ్రహాలు కలిసి ఆవిష్కరించడంతో దేశంలోని రాజకీయనాయకులు మొత్తం ఈ ఇద్దరి వైపు చూసి ఆశ్చరం వ్యక్తం చేశారు. సీఎంలు కరుణానిధి, యడ్యూరప్ప మంచి నిర్ణయం తీసుకున్నారని ఇరు రాష్ట్రాల చిత్రపరిశ్రమ ప్రముఖులు అభినందించారు.
చిన్నతంబి, పెద్దన్న
బెంగళూరులో తిరువళ్ళవర్ విగ్రహం ఆవిష్కరించిన తరువాత కరుణానిధి మాట్లాడుతూ కర్ణాటక సీఎం యడ్యూరప్ప తనకు చిన్నతంబి లాంటి వారు అని అన్నారు. కన్నడిగులు తనకు సోదరులు అంటూ కావేరీ వివాదం పెద్దదికాకుండా చూడాలని ప్రయత్నించారు. చెన్నైలో సర్వజ్ఞ విగ్రహం ఆవిష్కరించిన తరువాత యడ్యూరప్ప మాట్లాడుతూ కరుణానిధి తనకు పెద్దన్న లాంటి వారని, తమిళ ప్రజలు తనకు సోదరులు అని చెప్పి వారికి దగ్గర కావడానికి ప్రయత్నించారు.
తీవ్రస్థాయిలో వ్యతిరేకత
తమిళ, కన్నడ మహాకవులు తిరువళ్ళవర్, సర్వజ్ఞ విగ్రహాలు ఏర్పాటు చేసే విషయంలో తమిళ, కన్నడ సంఘాలు వ్యతిరేకించినా కరుణానిధి, యడ్యూరప్ప ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోలేదు. ఆ సందర్బంలో నిరసనలు వ్యక్తం అవుతున్నా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారు అనుకున్న పని పూర్తి చేశారు.
సీఎం కాదు చిన్నతంబి
యడ్యూరప్పను ఇక ముందు సీఎం అని పిలవమని, చిన్నతంబి అని పిలుస్తామని కొన్ని కన్నడ సంఘాలు అప్పట్లో మండిపడ్డాయి. యడ్యూరప్ప కర్ణాటకకు ముఖ్యమంత్రినా ? లేదా తమిళనాడుకు ఉప ముఖ్యమంత్రినా అనే విషయం బీజేపీ నాయకులు చెప్పాలని అప్పట్లో కొన్ని కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్న సమయంలో కర్ణాటకతో మంచి సంబంధాలు పెట్టుకుని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుని వెళ్లారు.