కరోనా: 24 గంటల్లో 2553 కొత్త కేసులు.. రికార్డు స్థాయిలో రికవరీలు.. రేపటిని తలుచుకుంటే వణుకు..
దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం అదుపులోకి రాలేదు. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 2553 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయిట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. కాగా, రికవరీల రేటు మన దేశంలో రికార్డు స్థాయిలో ఉందని, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 1074మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు. మొత్తంగా 27.5 శాతం రికవరీ రేటుతో 11,706 మందికి వ్యాధి నయమైందన్నారు. 1374మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 29,453గా ఉందన్నారు.
కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ పుణ్య సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. మూడో దశ లాక్ డౌన్ ఈనెల 17 వరకు కొనసాగనున్నందున, అప్పటి దాకా విమాన, మెట్రో, రైలు సర్వీసులేవీ పనిచేయబోవని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా, పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే కేంద్ర హోం శాఖ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా నేషనల్ హైవే అథారిటీ హెల్ప్ లైన్ నంబర్ 1033కి సంబంధిత డ్రైవర్లు ఫోన్ చేయొచ్చని చెప్పారు.
Recommended Video
లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన తొలిరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2553 కొత్త వైరస్ కేసులు వెలుగులోకి రావడం గమనార్హం. సడలింపులు గ్రీన్, ఆరెంజ్ జోన్లకే పరిమితం అయినప్పటికీ, దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు జనం భారీగా బారులుతీరడం, సోషల్ డిస్టెన్సింగ్ అసలే పాటించకపోవడంతో రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత ఎలా ఉండబోతుందో తల్చుకుంటేనే వణికే పరిస్థితి. కొత్త కేసులు నమోదైతే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మళ్లీ ఆంక్షలు విధించి, రెడ్ జోన్ గా మార్చుతారని తెలిసిందే.