ఎంజీ మోటార్ లో వాటా కోసం పోటీపడుతున్న రిలయన్స్, హీరో
చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్ (MG Motor) భారత్లోని తన అనుబంధ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం దేశీయంగా కొనుగోలుదారుల కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), హీరో గ్రూప్ (Hero group), జేఎస్డబ్ల్యూ గ్రూప్ (JSW group), ప్రేమ్జీ ఇన్వెస్ట్ వంటివి రేసులో ఉన్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆఖరుకల్లా డీల్ పూర్తి చేయాలని ఎంజీ మోటార్ భావిస్తోంది.
మెజారిటీ వాటా విక్రయించడం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించే ప్రణాళికలో ఉన్నట్లు ఎమ్జీ మోటార్ ఇండియా వెల్లడించింది. ప్రధానంగా భారత్ లోని భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎమ్జీ మోటార్.. ప్రస్తుతం చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ చేతిలో ఉంది. 2028 కల్లా మన దేశంలో కార్యకలాపాలను విస్తరించడం కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోంది.

చైనాలోని ఎస్ఏఐసీ నుంచి మూలధనాన్ని సేకరించేందుకు ఎమ్జీ ఇండియా ప్రయత్నిస్తున్నా సఫలమవడంలేదు. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ జరిగిన తర్వాత ఇండియా ఎఫ్డీఐ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో రెండు సంవత్సరాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పొందేందుకు ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇవేవీ సత్ఫలితాలనివ్వకపోవడంతో ప్రత్యామ్నాయం మార్గం కోసం ప్రయత్నిస్తోంది. వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో దేశంలో రెండో తయారీ ప్లాంటు నెలకొల్పాలని, వార్షిక సామర్థ్యాన్ని 3,00,000 వాహనాలకు చేర్చాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications