చారిత్రక శ్రీనగర్ లాల్ చౌక్పై ఎగిరిన త్రివర్ణ పతాకం: 30 ఏళ్ల తర్వాత, 370 ఆర్థికల్ రద్దు ఫలితమే(వీడియో)
శ్రీనగర్: సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ లాల్చౌక్ క్లాక్ టవర్పై జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ చారిత్రక క్లాక్ టవర్పై 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సామిజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్ షా, సాహిల్ బషీర్ భట్లు క్రేన్ సాయంతో క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
గత కొన్నేళ్లుగా పాక్ జెండా లేదా 144 సెక్షన్
గతంలో జనవరి 26న ఈ చారిత్రక క్లాక్ టవర్పై పాకిస్థాన్ జెండాను ఎగరవేయడం లేదా సెక్షన్ 144 విధించడం ఇక్కడ పరిపాటిగా జరుగుతుండేది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత వెంటనే కూడా లాల్ చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అనుమతి లభించలేదు.
370 ఆర్టికల్ రద్దుతో 30ఏళ్ల తర్వాత లాల్చౌక్పై ఎగిరిన త్రివర్ణ పతాకం
కానీ, ఈసారి మాత్రం ఇద్దరు సామాజిక కార్యకర్తలు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకుని జెండాను ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సాజిద్ యూసుఫ్ షా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానికే ఈ క్రెడిట్ దక్కుందన్నారు. లాల్ చౌక్లో జెండాను ఎగురవేసే అవకాశం తమకు లభించడం గర్వంగా ఉందన్నారు.
చరిత్ర తిరగరాశామంటూ శ్రీనగర్ వాసులు
మొదటిసారిగా తాము భారతదేశంలో ఉన్నామనే భావన కలుగుతోందని యూసుఫ్ ఆనందం వ్యక్తం చేశారు. సాహిల్ బషీర్ భట్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ దొంగలు గతంలో ఇక్కడ వారి పతాకాన్ని ఆవిష్కరించేవారని.. ఆ చరిత్రను తిరగరాసినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. భారీగా పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు.
370 ఆర్టికల్ రద్దుతో నయా కాశ్మీర్..
కాగా, 370వ ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్లో పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నయా కశ్మీర్ అంటే ఏమిటని జనం అడుగుతున్నారు? ఇవాళ ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కాశ్మీర్కు అర్ధం చెబుతుందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇదే జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది కూడా. మాకు పాకిస్థాన్ జెండాలు అక్కర్లేదు. మేము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నాం అని జెండా ఆవిష్కరణ అనంతరం అక్కడి స్థానికులు పేర్కొన్నారు.
1992లో లాల్ చౌక్లో మోడీ
ఇది ఇలావుండగా, భారత జెండాను ఆవిష్కరించేందుకు కాశ్మీర్లోని శ్రీనగర్లోని లాల్ చౌక్కు వెళుతున్నప్పుడు నరేంద్ర మోడీ 1992 జనవరి 24వ తేదీన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ 73వ గణతంత్ర దినోత్సవం నాడు సోషల్ మీడియా, వెబ్సైట్లలో వైరల్గా మారింది. అప్పుడే ఆర్టికల్ 370 రద్దు చేయాలంటూ మోడీ ఉద్యమం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారే ఆర్టికల్ 370ని రద్దు చేసింది.
Recommended Video