నిద్రపోనివ్వం: ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ, యడ్యూరప్ప, బళ్లారి బ్రదర్స్, రామలింగా రెడ్డి!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నాలు చేసిన బీజేపీ నాయకుల మీద విచారణ జరిపించాలని మనవి చేస్తామని ఆ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. బీఎస్ యడ్యూరప్పను సీఎం చేసి కర్ణాటకను లూటీ చెయ్యాలని బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ప్రయత్నాలు చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి ఆరోపించారు. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో సోమవారం రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆపరేషన్ కమల
బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో భారీ మొత్తంలో నగదు ఆశ చూపించి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాలని ప్రయత్నాలు చేశారని, ఆ ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయని మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.
నకిలీ ఆడియో క్లిప్పింగ్
ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులు ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రామలింగా రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్ని నాటకాలు అడినా విచారణలో అసలు విషయాలు వెలుగు చూస్తాయని, ఎవ్వరూ తప్పించుకోలేరని రామలింగా రెడ్డి అన్నారు.
ఢిల్లీ డబ్బులా, లూటీ డబ్బులా
2008 నుంచి 2013 వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది అనే విషయం అందరికీ తెలిసిందే అని రామలింగా రెడ్డి అన్నారు. 2008 నుంచి 2013 వరకూ కర్ణాటకలో లూటీ చేసిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాలని చూశారా, లేదా ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయా అని రామలింగా రెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
నిద్రపోనివ్వం
కాంగ్రెస్, జేడీఎస్ నాయకులను నిద్రపోనివ్వం అని బీజేపీ నాయకులు హెచ్చరించారని రామలింగా రెడ్డి గుర్తు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వస్తామని అవినీతిలో కూరుకుపోయిన బీఎస్. యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు కలలుకన్నారని రామలింగా రెడ్డి ఆరోపించారు. అధికారం చెయ్యిజారి పోవడంతో ఇప్పుడు వారికి నిద్రరావడం లేదని రామలింగా రెడ్డి వ్యంగంగా అన్నారు.