రాజ్యసభ ఎన్నికల హోరు-జోరుగా రిసార్టు రాజకీయాలు-ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది ?
రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్ధానాల కోసం రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు తమ అభ్యర్ధుల్ని గెలిపించుకునేందుకు చెమటోడుస్తున్నాయి. దీంతో రిసార్టు రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో సంకీర్ణకూటమి మహావికాస్ అఘాడీ తమ అభ్యర్ధుల్ని రిసార్టులకు తరలిస్తోంది. రాజస్ధాన్, హర్యానాలోనూ కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్ధుల్ని రిసార్టులకు తరలించేస్తున్నాయి.
15 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు పలు ప్రాంతీయ అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. జూన్, ఆగస్టులో రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యుల స్ధానంలో వీరు ఎన్నిక కావాల్సి ఉంది. తాజాగా రిటైర్ అవుతున్నవారిలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీతో పాటు కాంగ్రెస్ నేతలు అంబికా సోనీ, కపిల్ సిబల్, జైరాం రమేష్, బీఎస్పీకి చెందిన సతీశ్ చంద్ర మిశ్రా ఉన్నారు. వీరి స్ధానంలో కొత్తగా అభ్యర్ధులు ఎన్నిక కానున్నారు.
రేపు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 57 స్ధానాలకు గానూ 11 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. ఇందులో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాల్ని వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకోబోతంది. కాబట్టి మిగిలిన 16 సీట్ల కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మహారాష్ట్రలో ఆరు ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒక్కో ఎఁపీ గెలవాలంటే ఇక్కడ 42 ఓట్లు అవసరం. 151 ఎమ్మెల్యేలు ఉన్న అధికార మహావికాస్ అఘాడీ కూటమి నుంచి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తరఫున ముగ్గురు ఎంపీలు ఎన్నికవడం ఖాయమే.
కానీ కూటమి తరఫున నాలుగో అభ్యర్ధిని కూడా రంగంలోకి దింపారు. 106 సీట్లు కలిగిన బీజేపీ రెండు ఎంపీ సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నా మూడో అభ్యర్ధిని బరిలోకి దింపింది. బీజేపీ తమ మూడో అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే 13 ఓట్లు, మహావికాస్ అఘాడీకూటమికి నాలుగో అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే 15 ఓట్లు అవసరం. దీంతో చిన్న పార్టీలు, ఇండిపెండెట్లను సీఎం ఉద్ధవ్ ఆశ్రయిస్తున్నారు.
రాజస్ధాన్ లో ఎంపీ సీటుకు 41 ఎమ్మెల్యేలు అవసరం. దీంతో 108 ఎమ్మెల్యేలున్న అధికార కాంగ్రెస్ రెండు సీట్లు గెల్చుకోవడం ఖాయం. కానీ మూడో అభ్యర్దిని కూడా నిలబెట్టింది. బీజేపీ ఓ ఎంపీని గెలిపించుకునే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ నిలబెట్టిన మూడో అభ్యర్ధికీ, బీజేపీ మద్దతిస్తున్న స్వతంత్ర అభ్యర్ధి సుభాష్ చంద్రకూ మధ్య వార్ నెలకొంది. దీంతో ఇక్కడ క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.
అలాగే కర్నాటకలోనూ రాజ్యసభ ఎంపీకి 45 ఓట్లు కావాలి. దీంతో 121 ఎమ్మెల్యేలు ఉన్న అధికార బీజేపీ ముగ్గురు అభ్యర్ధుల్నిరంగంలోకి దించింది. 70 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్ధుల్ని, 32 ఎమ్మెల్యేలు ఉన్న జేడీఎస్ ఓ అభ్యర్ధిని బరిలోకి దింపాయి. దీంతో ఇక్కడా రిసార్టు రాజకీయాలు సాగుతున్నాయి. హర్యానాలోనూ బీజేపీ, కాంగ్రెస్ ఒక్కో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ నిలబెట్టిన కార్తికేయ శర్మ గెలవాలంటే 31 ఓఠ్లుకావాలి. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ మాకెన్ కు 31 ఓట్లు ఉన్న క్రాస్ ఓటింగ్ భయం నెలకొంది.