కప్పు టీకి ఏడుగురు జవాన్లు బలి: మోడీపై శివసేన
ముంబై: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. ఇప్పటికైనా మోడీ ప్రపంచాన్ని ఏకం చేసే పనిని మానుకుని భారత్ పై దృష్టి పెట్టాలని ఘాటుగానే సూచించింది.
పాకిస్థాన్ ను నమ్మరాదని తాము గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించామని, అయినా ఆయన తమ మాటలను లెక్కచెయ్యకపోవడం వలనే ఈ రోజు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో తీవ్రపదజాలంతో దుమ్మెత్తిపోసింది.
మన సరిహద్దులు సరిగా లేవని తాజా ఉగ్రవాదాడి స్పష్టం చేసిందని, దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో ఉందని గుర్తు చేసింది. అయితే సోషల్ మీడియాలో అమరులకు నివాళులు అర్పించడం మినహాయిస్తే జాతీయ స్థాయిలో ఎలాంటి పని జరగడం లేదని శివసేన ఆరోపించింది.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కప్పు టీ పంచుకున్నందుకు ప్రతిఫలంగా ఏడుగురు భారత జవాన్లు అమరులయ్యారని విచారం వ్యక్తం చేశారు. మన అంతర్గత భద్రత విధ్వంసపూరితంగా ఉందని, సరిహద్దులు సురక్షితంగా లేవని శివసేన మండిపడింది.
ఆరు మంది ఉగ్రవాదులతో భారత ఆత్మగౌరవాన్ని పాకిస్థాన్ దెబ్బతీసిందని ఆరోపించారు. గత వారం లాహోర్ లోని నవాజ్ షరీఫ్ ఇంటికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లినా పాకిస్థాన్ మనల్ని మరో సారి మోసం చేసిందని శివసేన చెప్పింది.
భారత్ తో పాకిస్థాన్ నిజంగా సత్సంబంధాలు కోరుకుంటే పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడి జరగడానికి కారణం అయిన జెష్ మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ను భారత్ కు అప్పగించాలని శివసేన డిమాండ్ చేసింది.