జేడీఎస్ చీలిక?: రేవణ్ణ ఎటువైపు!, అంతా బీజేపీ మైండ్ గేమా?
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో అంతా ఊహించినట్టే హంగ్ ఏర్పడింది. కానీ కింగ్ మేకర్ అవుతుందనుకున్న జేడీఎస్.. ఇప్పుడు ఏకంగా తానే కింగ్ గా అవతరించే అవకాశం కూడా ఉంది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠంపై కూర్చోనివకుండా చేయాలన్న కాంగ్రెస్ పంతం.. సీఎం కావాలన్న కుమారస్వామి ఆకాంక్ష.. వెరసి ఆ రెండు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాకాలు చేసుకుంటున్నాయి.
Recommended Video
అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను కాదని, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, జేడీఎస్ ముందుకు రావడం అనైతిక పరిణామం అని బీజేపీ వాదిస్తోంది. కానీ గతంలో గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కూడా ఇదే సిద్దాంతాన్ని ఫాలో అయిందన్నది విస్మరించలేని విషయం.
జేడీఎస్ చీలిక?
అధికార పీఠానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా జేడీఎస్ లో చీలికలు తెచ్చి.. కాంగ్రెస్ తో ఆ పార్టీ జతకట్టడాన్ని దెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణను పావుగా వాడుకోవాలని చూస్తోంది. రేవణ్ణ వెనకాల దాదాపు 10మంది ఎమ్మెల్యేలు ఉండటంతో.. ఆయన్ను తమవైపుకు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది.
బీజేపీ మైండ్ గేమా?
రేవణ్ణ తమవైపే ఉన్నారని బీజేపీ సీఎం అభ్యర్థి గవర్నర్ ను కలిసి న సందర్భంగా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రేవణ్ణ నుంచి మాత్రం ఇంతవరకు దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. తమ్మునిపై ఉన్న అసంతృప్తితో ఆయన నిజంగానే బీజేపీ వైపు చూస్తున్నారా?.. లేక ఇదంతా కేవలం బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమేనా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
రేవణ్ణ ఎటువైపు?
రేవణ్ణకు, కుమారస్వామికి.. వారి భార్యలకు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నట్టుగా మాత్రం తెలుస్తోంది. ఈ కారణంగానే కుమారస్వామి వెంట నడవడానికి రేవణ్ణ తటపటాయిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సొంత కుటుంబానికి అధికారం దక్కడాన్ని కాదనుకుని.. బీజేపీ నీడలో పనిచేయడానికి రేవణ్ణ సిద్దపడుతారా? అన్నది వేచి చూడాలి.
బీజేపీ మాత్రం రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులను ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రేవణ్ణ తండ్రి దేవెగౌడ మాట మేరకే తమ్ముడికి మద్దతు తెలుపుతారా?.. లేక సొంత ప్రయోజనాల కోసం బీజేపీతోనే చేతులు కలుపుతారా? అన్నది ఆసక్తికరం.
ముందు ప్రభుత్వ ఏర్పాటుకే బీజేపీ మొగ్గు
జేడీఎస్ లో చీలిక సంగతి పక్కనపెడితే.. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మంచిదనే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోతే దక్షిణాదిలో కమల వికాసానికి గండిపడే అవకాశం ఉంది కాబట్టి.. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత బలనిరూపణకు సిద్దపడే అవకాశం ఉంది. గవర్నర్ ఇచ్చే గడువులోగా మిగతా మద్దతును ఎలా కూడగట్టాలనే దానిపై పావులు కదపనుంది.