కర్ణాటక గవర్నర్ కు రెండు లేఖలు రాసిన బీఎస్ యడ్యూరప్ప: బోమ్మాయ్ కేసు, సుప్రీం కోర్టులో!
బెంగళూరు: బీఎస్. యడ్యూరప్ప కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలాకు రెండు లేఖలు రాశారు. ఆ రెండు లేఖలు గవర్నర్ వాజుబాయ్ వాలా క్షుణ్ణంగా పరిశీలించి యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఆహ్వానించారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు బీఎస్. యడ్యూరప్ప గవర్నర్ వాజుబాయ్ వాలాకు రాసిన లేఖల సారాంశం ఇలా ఉంది.

మొదటి లేఖ
బీఎస్ యడ్యూరప్ప మే 15వ తేదీన గవర్నర్ వాజుబాయ్ వాలాకు మొదటి లేఖ రాశారు. అందులో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుందని, అతి పెద్ద పార్టీ అయిన మాకు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప వివరించారని తెలిసింది.

యడ్యూరప్ప రెండో లేఖ
బీఎస్. యడ్యూరప్ప మే 16వ తేదీన గవర్నర్ వాజుబాయ్ వాలాకు రెండో లేఖ రాశారు. రెండో లేఖలో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఏకైక పార్టీ బీజేపీ అని, మాకు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప మనవి చేశారు. రెండో లేఖలో ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం పెట్టలేదని తెలిసింది.

ఎస్ఆర్. బోమ్మాయ్ కేసు
గతంలో ఎస్ఆర్ బోమ్మాయ్ కేసు విషయంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. ఎస్ఆర్ బోమ్మాయ్ కేసు విషయాన్ని పరిగణలోని తీసుకున్న కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీఎస్. యడ్యూరప్పను ఆహ్వానించారని న్యాయనిపుణులు అంటున్నారు.

సుప్రీం కోర్టులో లేఖలు
బుధవారం అర్దరాత్రి సుప్రీం కోర్టులో విచారణ జరిగిన సమయంలో అటర్నీ జనరల్ యడ్యూరప్ప రాసిన రెండు లేఖలను సమర్పించారు. అసెంబ్లీ సమావేశంలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ వాజుబాయ్ వాలా యడ్యూరప్పకు సూచించారని అటర్నీ జనరల్ సుప్రీం కోర్టుకు చెప్పారు.

ఒకటి కాదు రెండు
అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి మెజారిటీ నిరూపించుకోవడానికి 7 రోజులు సమయం కావాలని బీఎస్. యడ్యూరప్ప గవర్నర్ వాజుబాయ్ వాలాకు మనవి చేశారు. అయితే గవర్నర్ వాజుబాయ్ వాలా సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవడానికి 15 రోజులు సమయం ఇచ్చి వివాదానికి కారణం అయ్యారు.












Click it and Unblock the Notifications