లాలూకి ఏమైంది?: జైలు నుంచి హడావుడిగా ఆసుపత్రికి, కార్యకర్తల్లో ఆందోళన!
పాట్నా: దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తూ బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్న బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(69) శనివారం హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ని హుటాహుటిన రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆస్పత్రిలో చేర్చారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగం వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. లాలూ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే లాలూ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఆసుపత్రి వర్గాల నుంచి ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల కాలేదు.

మరోవైపు లాలూ ఆరోగ్య పరిస్థితిపై ఆర్జేడీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనకు సడన్గా ఏమయ్యింది? ఆస్పత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఇవే ప్రశ్నలు అందర్నీ వెంటాడుతున్నాయి. ఉన్నట్టుండి ఆయన్ను జైలు నుంచి హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రిలో చేర్చడం పలు ఆలోచనలకు తావిస్తోంది.
తండ్రి అనారోగ్య పరిస్థితి గురించి తెలియగానే తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నా నుంచి రాంచీకి చేరుకున్నారు. రిమ్స్కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్తో పాటూ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు రిమ్స్ దగ్గరకు చేరుకున్నారు.
లాలూ ఆరోగ్య పరిస్థితిపై వానంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతను చూసేందుకు అనుమతి ఇవ్వడం లేదని... ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని మీడియా ద్వారా తెలుసుకొని తామంతా ఆసుపత్రికి వచ్చినట్లు వారు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications