అమిత్ షా ఆహ్వానాన్ని తోసిపుచ్చిన ఆర్ఎల్డీ ఛీఫ్ జయంత్ చౌదరి-మత విద్వేషాల పార్టీ అంటూ ఫైర్
యూపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. అసలే కరోనా కారణంగా బహిరంగంగా ప్రచారాలు నిర్వహించలేని పరిస్ధితుల్లో వర్చువల్ ప్రచారాలకే పరిమితమవుతున్న నేతలు.. విమర్శలు, ప్రతి విమర్శలకు పదునుపెడుతున్నారు. అలాగే విపక్ష సమాజ్ వాదీ పార్టీతో జట్టు కట్టిన తమ మాజీ మిత్రపక్షం ఆర్ఎల్డీని తిరిగి దగ్గర చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు..
ఆర్ఎల్డీ రాక కోసం బీజేపీ ద్వారాలు తెరిచే ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరి తోసిపుచ్చారు. అమిత్ షా ఆహ్వానాన్ని జయంత్ చౌదరి ఎగతాళి చేశారు. ఉత్తరప్రదేశ్లో జాట్లను ఏకాకిని చేసి మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే వ్యూహంగా దీన్ని ఆయన అభివర్ణించారు. మత విద్వేషాలకు కారణమయ్యే బీజేపీతో తాను ఎప్పటికీ చేతులు కలపబోనని జయంత్ స్పష్టం చేశారు. అంతే కాదు అమిత్ షా కలుపుకోవాల్సింది తనను కాదని, రైతుల ఉద్యమంలో ఇళ్లు కోల్పోయిన 700 కుటుంబాలను అని ఆయన హితవు పలికారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను బీజేపీలో చేరొచ్చనే అనుమానాల్ని సృష్టించడం ద్వారా ముస్లిం ఓట్లను పొందకుండా అడ్డుకోవడానికి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు జయంత్ వ్యాఖ్యానించారు. అమిత్ షా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలతో ముస్లింలు.. బీఎస్పీకి కానీ లేదా ఎంఐఎంకు ఓటు వేస్తారని తెలిపారు. ఇది కేవలం ముస్లిం ఓట్లను విభజించడానికి అమిత్ షా వేస్తున్న ఎత్తుగడగా జయంత్ అభివర్ణించారు. అమిత్ షా హర్యానాలో చేసినట్లుగా యూపీలోనూ జాట్లను ఒంటరి చేయాలనుకుంటున్నారని, కానీ తాను అలా జరగనివ్వనని జయంత్ తెలిపారు. యూపీ ఎన్నికల తర్వాతే కాదు, తాను ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా తన పార్టీ ఆర్ఎల్డీ పని అయిపోతుందని వ్యాఖ్యానించారు.