నగదు సహా ఏటీఎం యంత్రం మాయం చేశారు
పంజాబ్: ఏటీఎం యంత్రాలలో నగదు లూటీ చేస్తున్న విషయం మనం అక్కడక్కడా చూస్తున్నాం. అయితే ఏటీఎం యంత్రాలను ఎత్తుకు పోవడం అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు మరో ఏటీఎం యంత్రం మాయం చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లో మహాత్మ గాంధీ గర్ల్స్ స్కూల్ సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం కేంద్రం ఉంది. శనివారం రాత్రి బ్యాంకు సిబ్బంది ఏటీఎం యంత్రంలో నాలుగు లక్షల రూపాయలు నిల్వ చేశారు. ఆదివారం వేకువ జామున 2.46 గంటల సమయంలో కొందరు దుండగులు ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు.
తరువాత అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు నల్లరంగు పెయింట్ పూసిన నిందితులు నగదు లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. వీలుకాకపోవడంతో ఏటీఎం యంత్రాన్ని అక్కడి నుండి తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ సురీందర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏటీఎం యంత్రంలో రూ. 2,80,500 ఉందని, మిగిలిన సోమ్ము ఖాతాదారులు డ్రా చేశారని (రూ. నాలుగు లక్షలలో) పోలీసులకు సమాచారం అందించారు. ఏటీఎం కేంద్రం ఉన్న పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ చరణ్ జిత్ శర్మ తెలిపారు.