అల్లర్ల బాధితురాలు: కిడ్నాప్, గ్యాంగ్ రేప్
ముజఫర్ నగర్: 2013 నాటి ముజఫర్ నగర్ అల్లర్లతో సొంతూరిని విడిచి పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి వేరే గ్రామానికి వలస వెళ్లిన బాలిక మీద దారుణం జరిగింది. కామాంధులు బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. ముగ్గరు నిందితులు పరారైనారు.
ఉత్తరప్రదేశ్ లోని బాఘ్ పట్ జిల్లా అంబెటా గ్రామంలో 14 ఏళ్ల బాలిక మీద ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారని పోలీసు అధికారులు చెప్పారు. ఈ కేసులో గ్రామ మాజీ ప్రధాన్ జమీర్ కుమారుడు జుల్ఫమ్ తో పాటు మరో ఇద్దరి మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు చెప్పారు.
బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయని పోలీసులు చెప్పారు. శనివారం ఉదయం బాలిక పొలం దగ్గరకు వెళ్లింది. తరువాత తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు.
నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. సంఘటనా స్థలంలో బాలిక అపస్మారక స్థితిలోపడి ఉన్న విషయం కుటుంబ సభ్యులు గుర్తించారు. తరువాత ప్రధాన నిందితుడి తండ్రిని నిలదీసి నిరసన వ్యక్తం చెయ్యడంతో వారు బాలిక కుటుంబ సభ్యులను చితకబాదారు.
బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించామని పోలీసు అధికారులు చెప్పారు. 2013 ముజఫర్ నగర్ జిల్లాలో జరిగిన ఘర్షణలతో బాలిక కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. కట్టుబట్టలతో అంబెటా గ్రామానికి వలస వెళ్లారు.