అబ్బో! నువ్వు సెక్యులరా? ఆలయాలు తెరవరా? గవర్నర్ కిరికిరి - దిమ్మతిరిగేలా సీఎం కౌంటర్
కరోనా సాక్షిగా వెకిలి రాజకీయాలకు మహారాష్ట్ర వేదిక అయింది. దేశంలోనే అత్యధిక కొవిడ్ కేసులు, మరణాలు నమోదైన మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. దీంతో పబ్లిక్ ప్లేసుల్లో లాక్ డౌన్ నిబంధనలను కొనసాగిస్తున్నారు. ఆంక్షలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలకు దిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని ఆలయాలను వెంటనే తెరవాలంటూ నిరసనలు నిర్వహిస్తున్నది ఈ క్రమంలోనే గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య అసహజ వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆలయాల వద్ద అరెస్టులు
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా జూన్-జులైలోనే ఆలయాలను తెరుస్తామని సీఎం ఉద్ధవ్ గతంలో ప్రకటించినప్పటికీ.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కోవిడ్ నిబంధనలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే, మహారాష్ట్రలో ఇంకా ఆలయాలు తెరవకపోవడాన్ని ప్రశ్నిస్తూ చాలా చోట్ల బీజేపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. మంగళవారం ముంబైలోని సిద్ధివినాయక్ ఆలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రసాద్ లాడ్ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుళ్లను తెరవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు సాయిబాబ ఆలయాన్ని కూడా తెరవాలంటూ షిర్డిలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో ఆలయాల వద్ద అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ అంశంపై సీఎంకు లేఖ రాసిన గవర్నర్ అందులో అనూహ్య వ్యాఖ్యలు చేయడం రచ్చకు దారితీసింది.

సెక్యూలర్ ఎప్పుడయ్యారు?
‘‘సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అయోధ్య వెళ్లి రాముణ్ని దర్శించుకున్నారు. పండరీపురంలో ఆషాఢ ఏకాదశి నాడు విఠల్ రుక్మిణి మందిరంలో పూజలు చేశారు. ఒకప్పుడు నేను సెక్యూలర్ కాదు హిందువునే అని ప్రకటించుకున్న మీరు.. ఇవాళ సడెన్ గా సెక్యూలర్ అయిపోయారా? ఏదైనా దివ్యస్వరం మీ చెవిలో సందేశం చెప్పిందా? రాష్ట్రంలో ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల పున:ప్రారంభాన్ని ఇంకా ఎన్నాళ్లు వాయిదా వేస్తారు? కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఆలయాల్లో దర్శనాలకు అమనుతి ఇవ్వండి..'' అని గవర్నర్ కోశ్యారీ లేఖలో రాశారు.

నీ సర్టిఫికేట్ అవసరం లేదు..
సెక్యూరల్ ఎప్పుడయ్యావంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ అదే స్థాయిలో బదులిచ్చారు. ‘‘నేను హిందుత్వను ఫాలో అవుతానని, నా హిందుత్వ భావాలకు నీ సర్టిఫికేట్ అవసరం లేదు. దివ్యస్వరాలు నాకు కాదు.. నీకే వినిపిస్తాయేమో. నువ్వు కూడా సెక్యూలర్ రాజ్యాంగంపైనే ప్రమాణం చేశావన్న సంగతి మర్చిపోతే ఎలా?అయినా, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడం ఎంత తప్పో.. ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం కూడా అంతే తప్పు అవుతుంది. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం'' అని సీఎం ఉద్దవ్ తెలిపారు. సీఎంకు రాసిన లేఖలో గవర్నర్ వాడిన పదాలు, వ్యక్తీకరించిన అభిప్రాయాలు వివాదాస్పదంగా మారాయి.












Click it and Unblock the Notifications