బైకు రేటు కన్నా చలానా రేటే ఎక్కువగా ఉంది కదా బాసూ ..!
సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా వేస్తారు. అది రూ. 500 కావచ్చు, రూ. 5000 కావచ్చు. కానీ, ఒక స్కూటర్ రైడర్కు ఏకంగా రూ. 20 లక్షల 74 వేల (రూ.20,74,000) చలానా పడితే పరిస్థితి ఏంటి? ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో జరిగిన ఈ అసాధారణ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
నవంబర్ 4వ తేదీన, గాంధీ కాలనీ వద్ద ఉన్న చెక్పాయింట్లో అన్మోల్ సింఘాల్ అనే యువకుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అన్మోల్ హెల్మెట్ ధరించకపోవడం, సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు ఆయన స్కూటర్ను సీజ్ చేసి, చలానా వేశారు. నిబంధనల ప్రకారం, ఆయన చెల్లించాల్సిన అసలు జరిమానా కేవలం రూ. 4,000 మాత్రమే.

విచారణ జరిపిన ఉన్నతాధికారులు, ఈ భారీ జరిమానా వెనుక కారణం కేవలం సాంకేతిక లేదా క్లరికల్ పొరపాటే అని తేల్చారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 (వాహనం సీజ్) కింద కేసు నమోదు చేయాల్సి ఉంది.చలానా జారీ చేసిన సబ్-ఇన్స్పెక్టర్ పొరపాటున ఆ '207' నంబర్ను అసలు జరిమానా మొత్తానికి తప్పుగా జోడించారు.
దీంతో రూ. 4,000 ఉండాల్సిన అసలు చలానా, రూ. 20,74,000గా డిజిటల్ రికార్డుల్లో నమోదైంది. ఈ పొరపాటును గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే చలానాను సవరించి, అన్మోల్ చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ. 4 వేలు మాత్రమే అని స్పష్టం చేశారు.
ఒక చిన్న నంబర్ పొరపాటు కారణంగా ఓ సామాన్య పౌరుడు గుండె ఆగినంత పని చేసిన ఈ సంఘటన.. డిజిటల్ చలానా వ్యవస్థలో చిన్న పొరపాట్లు ఎంత పెద్ద గందరగోళానికి దారితీయగలవో మరోసారి తెలియజేసింది. చివరికి, విషయం సద్దుమణగడంతో స్కూటర్ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు.












Click it and Unblock the Notifications