47 మంది ఎంపీల హోటల్ ఖర్చు రూ.24 కోట్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు బస చెయ్యడానికి విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్స్, లగ్జరీ గెస్ట్ హౌస్ లు ఉపయోగించడంతో రూ. 24 కోట్ల ప్రజా ధనం వృధా అయ్యింది. కేవలం 14 నెలలలో మన ప్రజా ప్రతినిధులు ఇంత మొత్తం ఖర్చు చేశారు. సుభాష్ చంద్ర అనే ఆర్ టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అర్జీ సమర్పించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.
పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ప్రజా ప్రతినిధికి 30 రోజుల్లోపు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం భాద్యత. అలా చెయ్యలేని పక్షంలో వారు బస చేస్తున్న హోటల్స్, గెస్ట్ హౌస్ లకు కేంద్ర ప్రభుత్వమే అద్దెలు చెల్లించాలని నియమాలు ఉన్నాయి.
బోజనం, ఫోన్ బిల్లులు, ఇతర ఖర్చులు ఎంపీలే భరించుకోవాలి. అయితే ప్రస్తుతం 47 మంది పార్లమెంట్ సభ్యులు ప్రయివేటు హోటల్స్, గెస్ట్ హౌస్ లలో బస చేస్తున్నారు. వారిలో 17 మందికి ఎంపీ క్వాటర్స్ కేటాయించారు. అయితే అందులో తాము బస చెయ్యడానికి సౌకర్యాలు లేవని వారు అంటున్నారు.
మరో ఐదు మందికి కేటాయించిన క్వాటర్స్ చాల బాగున్నాయి. అయితే వారు తమ రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం క్వాటర్స్ చిక్కకపోవడంతో అనేక మంది ప్రముఖ పార్లమెంట్ సభ్యులు సైతం ప్రయివేటు హోటల్స్ లో బస చేస్తున్నారు.