75ఏళ్ల రిటైర్మెంట్ పై తేల్చేసిన ఆరెస్సెస్ ఛీఫ్..! మోడీకి భారీ ఊరట..!
దేశంలో రాజకీయ నేతలు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని గతంలో వ్యాఖ్యానించిన ఆరెస్సెస్ అధినేత బీజేపీ ఆగ్రహంతో యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని మోడీ 75 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆరెస్సెస్ ఛీఫ్ పెట్టిన రూల్ ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకుని మరొకరికి ఆ పదవి అప్పగిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 75 ఏళ్ల రూల్ పై ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ యూటర్న్ తీసుకున్నారు.
75 ఏళ్లకు రిటైర్ అవ్వాలన్న నిబంధన మేరకు ప్రధాని మోడీ పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాల్ని ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ ఇవాళ ఖండించారు. తాను పదవీ విరమణ చేస్తానని లేదా మరొకరు 75 ఏళ్లు నిండినప్పుడు పదవీ విరమణ చేయాలని తానెప్పుడు చెప్పలేదని భగవత్ తేల్చిచెప్పేశారు. సంఘ్ చెప్పినట్లు తాము నడుచుకుంటామన్నారు. ఆరెస్సెస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి 75 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలనే రూల్ లేదని బీజేపీ ఇప్పటికే ప్రధాని రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలపై పదే పదే చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరెస్సెస్ ఛీఫ్ సైతం ఇదే విషయం చెప్పేయడంతో ప్రధాని మోడీకి భారీ ఊరట లభించినట్లయింది. 75 ఏళ్ల రిటైర్మెంట్ నిబంధన వర్తింపచేస్తే మాత్రం ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో మోడీ తో పాటు మరికొందరు మంత్రులు తప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని ఆరెస్సెస్ తేల్చేయడంతో వారందరికీ ఊరట దక్కినట్లయింది.

వచ్చే నెల 17న ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు ఉంది. ఆ రోజే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారని, ఆయన స్ధానంలో నమ్మకస్తుడైన హోంమంత్రి అమిత్ షాను ప్రధానిగా చేస్తారని విపక్షాలు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించాయి. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తోంది. ఓ దశలో ప్రధాని మోడీ తర్వాత ఆ స్ధానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను సైతం నియమిస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఆరెస్సెస్ ఛీఫ్ యూటర్న్ తో ఆ ఊహాగానాలకు చెక్ పడింది.












Click it and Unblock the Notifications