Caste Census: కులగణనతో హిందువుల్లో చీలిక- వ్యతిరేకిస్తున్నామన్న ఆరెస్సెస్..!
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే విపక్ష ఇండియా కూటమిలో ఉన్న బీహార్ ప్రభుత్వం కులగణనను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయిలో కులగణన హామీ కూడా ఇస్తోంది. దీంతో ఇరుకునపడ్డ అధికార బీజేపీ ఇప్పుడు కులగణనపై అంతర్గతంగా చర్చిస్తోంది. ఈ సమయంలో బీజేపీ ఆత్మగా చెప్పుకునే ఆరెస్సెస్ కులగణనకు తాము వ్యతిరేకమని తేల్చిచెప్పేసింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తాము కుల ప్రాతిపదికన జనాభా గణన డిమాండ్కు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అలాంటి చర్య దేశంలో సామాజిక అసమానతలను తీవ్రతరం చేస్తుందని పేర్కొంది. నిన్న నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్ కాంప్లెక్స్ను సందర్శించిన మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ లోని అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీ, శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యేలకు ఈ మేరకు ఆరెస్సెస్ సీనియర్ నేతలు తమ వైఖరిని స్పష్టం చేశారు.

ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారక్, విదర్భ ప్రాంత్ చీఫ్ శ్రీధర్ ఘడ్గే బిజెపి, శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కుల జనాభా గణనకు సంఘ్ అనుకూలంగా లేదని, ఇది హిందూ సమాజంలో విభేదాలను మరింత పెంచుతుందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్గేవార్కు నివాళులు అర్పించేందుకు బిజెపి, శివసేన ఎమ్మెల్యేలు నాగ్పూర్లోని రేషింబాగ్లోని స్మృతి మందిర్ క్యాంపస్కు వచ్చిన సమయంలో ఘడ్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో రిజర్వేషన్ కోటా వివాదాల పరిష్కారానికి కుల గణన చేపట్టాలని డిప్యూటీ సీఎం అజియ్ పవార్ భావిస్తున్న తరుణంలో ఆరెస్సెస్ నేతల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము సామాజిక సమానత్వం కోసం పనిచేస్తున్నామని, సామాజిక అసమానత కులం కారణంగానే వచ్చిందని ఆరెస్సెస్ నేతలు తెలిపారు. మహాత్మా గాంధీ సహా ప్రతి ఒక్కరూ గతంలో కులాన్ని నిర్మూలించాలని చెప్పారన్నారు. అయితే కులాన్ని నిర్మూలించాలని, అదే సమయంలో కులాల సర్వే జరగాలని చెబితే అవి రెండూ విరుద్ధమని తెలిపింది.












Click it and Unblock the Notifications