boycott Chinese products: కీలక చర్యల దిశగా కేంద్రం అడుగులు
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న చైనాపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనా ఉత్పత్తులను స్వచ్ఛందంగానే అనేక మంది ప్రజలు బహిష్కరిస్తున్నారు. చైనా ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం
చైనా ఉత్పత్తులపై నిషేధం..
ఈ నేపథ్యంలో చైనాతోపాటు పలు దేశాల నుంచి చౌక ధరలు, తక్కువ నాణ్యత కలిగిన వస్తువుల దిగుమతులపై నిషేధం విధించేందుకు అవసరమైన నిబంధనలను త్వరలోనే వెల్లడించనున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. పొరుగు శత్రు దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులను నిషేధించాలని సూచించారు.
భారత ప్రజలకు ఆ అవసరం లేదు..
భారత్ పట్ల దురహంకారంతో, శుత్రుత్వంతో వ్యవహరించడాన్ని అంత తేలికగా తీసుకోకూడదని.. చైనా వస్తువులను తప్పకుండా నిషేధించాల్సిందేనని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వ హయాంలో రక్షణమంత్రిగా పనిచేసిన జార్జి ఫెర్నాండేజ్ కూడా చైనాను భారత్కు మొదటి శత్రువుగా పేర్కొన్నారంటూ ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో శత్రుదేశాల నుంచి వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం భారత ప్రజలకు లేదని అన్నారు.
ప్రజలే బహిష్కరించవచ్చు.. తుది దశలో నిబంధనలు
ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించవచ్చని కేంద్రమంత్రి పాశ్వాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధనలు భారతీయ ప్రమాణాల సంస్థను బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ నిబంధనలు తుది దశలో ఉన్నాయని వివరించారు.
Recommended Video
దేశానికే తొలి ప్రాధాన్యం..
చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తే అందుకనుగుణంగా పారిశ్రామికవేత్తలు పోటీ ధరలతో నాణ్యత కలిగిన వస్తువులను తయారు చేయాలని సూచించారు. తొలి ప్రాధాన్యం దేశానికేనని, ఆ తర్వాతే సంస్థలు, వ్యక్తుల ప్రయోజనాలని తేల్చి చెప్పారు. చైనా ఉత్పత్తులతో వ్యాపారాలు చేస్తున్నవారి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇక చైనా దాడుల్లో మన సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దౌత్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, ఓ వైపు చర్చలు జరుపుతుండగానే దాడులకు దిగి 20 మంది భారత సైనికులను చైనా పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. భారత దళాల ప్రతిదాడుల్లో 35 మందికిపైగా చైనా సైనికులు హతమైనట్లు సమాచారం.