పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు!
ప్రపంచంలో వేగంగా పరిగెత్తే కారు ఏదో తెలుసా?.. ఎక్కువగా ఆలోచించొద్దు.. మరోదో కాదు.. కారు గానీ కారు.. పుకారు. అవును ఈ పుకార్లు 5జీ స్పీడ్ కంటే వేగంగా వ్యాపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మనదేశంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పుకారు కూడా జెట్ స్పీడ్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఇండియాలో పుకార్ల చరిత్రను ఒక్కసారి తిరగేస్తే .. ఈ దేశం రెండు అంశాలపై నడుస్తుందని అనిపిస్తుంది. ఒకటి నమ్మకం, రెండోది భయం. ఈ రెండూ కలిస్తే పుట్టేదే పుకారు. ఇది కంటికి కనిపించదు, పట్టుకుందామంటే దొరకదు. కానీ దేశం మొత్తాన్ని పరుగులు పెట్టించగలదు.
ప్రస్తుతం ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రేపటి నుంచి పెట్రోల్ దొరకదు అనే ఒక్క పుకారు.. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కట్టేలా చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. " పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం మొత్తుకుంటున్నా ప్రజలు పుకార్లనే నమ్ముతున్నారు. ఇలాగే ఉంటే కొన్ని రోజులు బంకులు మూసివేయాల్సి వస్తుంది" అని హెచ్చరించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గతంలో సంచలనం సృష్టించిన కొన్ని పుకార్లు
మన దేశంలో పుకార్లు కేవలం యుద్ధ కాలంలోనే రావు, అప్పుడప్పుడు విచిత్రమైన రూపాల్లో కనిపిస్తుంటాయి.
పాలు తాగిన గణపతి (1995): ఓ రోజు ఉదయం వినాయక విగ్రహాలు పాలు తాగుతున్నాయని వార్త వ్యాపించింది. శాస్త్రవేత్తలు ఇది 'క్యాపిలరీ యాక్షన్' అని మొత్తుకున్నా, జనం మాత్రం స్పూన్లు పట్టుకుని దేవాలయాలకు పరుగులు తీశారు.
మంకీ మ్యాన్ (2001): ఢిల్లీలో సగం కోతి, సగం మనిషి రూపంలో ఓ వింత జీవి తిరుగుతోందని పుకారు పుట్టింది. రాత్రి పూట జనం కర్రలు పట్టుకుని గస్తీ కాశారు. చివరికి తెలిసింది ఏంటంటే.. మంకీ మ్యాన్ కంటే మన ఊహలే ఎక్కువ ప్రమాదకరమని తెలిసి అందరూ నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.
జడలు కత్తిరించడం (2017): ఎవరో వచ్చి మహిళల జడలు కత్తిరిస్తున్నారనే వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భయంతో మహిళలు హెల్మెట్లు ధరించి నిద్రపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ 'జడలు కత్తిరించే వ్యక్తి' మాత్రం ఎవరికీ దొరకలేదు.
4జీ, 5జీ వేగంతో పుకార్లు
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు పుకార్లకు రెక్కలు వచ్చాయి. నడవాల్సిన అవసరం లేకుండానే 4జీ, 5జీ నెట్వర్కుల ద్వారా క్షణాల్లో దేశమంతటా పాకుతున్నాయి. కొవిడ్ సమయంలో వైరస్ కంటే దాని గురించి వచ్చిన మెసేజ్లే ఎక్కువ భయాన్ని రేకెత్తించాయి. మొబైల్ టవర్ల వల్ల కరోనా వస్తుందని కొందరు టవర్లను కూల్చివేసేందుకు వెళ్లడం మన పుకార్ల స్థాయికి నిదర్శనం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మన వాట్సాప్ గ్రూపుల్లో రేషన్ నిల్వ చేసుకోండి, గ్యాస్ సిలిండర్లు దొరకవు అనే సందేశాలు ట్రెండ్ అవుతుంటాయి. ప్రభుత్వం ఎంత వివరణ ఇచ్చినా.. ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నామనే మాటకే విలువ ఎక్కువ.
పుకారుపై మనకున్న అచంచల విశ్వాసం
ఇండియాలో ఎక్కడో విన్నాను అనేది ఓ పెద్ద సంస్థలా పనిచేస్తుంది. దీనికి కార్యాలయం లేదు, వెబ్సైట్ లేదు.. కానీ దీనికి ఉన్న విశ్వసనీయత ప్రభుత్వ అధికారిక ప్రకటనల కంటే ఎక్కువగా ఉంటుంది. "ఈ రాత్రికి ఏదో జరగబోతోంది" అనే చిన్న మాట చాలు.. జనం తమకు తోచిన కథలను అల్లేసుకుంటారు. పుకార్లు మన ఆలోచనల్లో ఉంటాయి. మనం ఏదైనా విషయాన్ని నిజనిజాలు తెలుసుకోకుండా నమ్మినంత కాలం కొత్త కొత్త మంకీ మ్యాన్లు, జడలు కత్తిరించడం వంటి ఆలోచనలు పుడుతూనే ఉంటారు. పెట్రోల్ సరఫరా ఎంతున్నా, భయంతో బంకుల వద్ద క్యూలు కడుతూనే ఉంటాం. అసలైన సంక్షోభం కంటే.. దాన గురించి వచ్చే పుకార్లే ఎక్కువ ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి.












Click it and Unblock the Notifications