ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ బుజ్జగింపు- అర్జంట్ ఫోన్ కాల్
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన కోలాహలం నెలకొంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్ను నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోన్న నేపథ్యంలో దీనికి ఉద్దేశించిన సన్నాహాక సమావేశాలు ఇప్పటికే మొదలయ్యాయి. బెంగళూరు, ముంబై, జైపూర్లల్లో సన్నాహక సదస్సులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జీ20 సభ్యదేశాల అధినేతలు..
అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్పింగ్.. సహా వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్లో పాల్గొనడానికి భారత్కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యలుగా కొనసాగుతున్నాయి.

పుతిన్ ఫోన్..
ఈ పరిణామాల మధ్య ఇవ్వాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం నిర్వహించబోయే ఈ సదస్సులో పాల్గొంటానని సూచనప్రాయంగా వెల్లడించారు. జీ20 అధ్యక్ష పదవి లభించడంలో సహకరించారంటూ ప్రధాని మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది.

షాంఘై కోఆపరేషన్..
ఈ ఏడాది సెప్టెంబర్లో 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగిన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల గురించి ప్రధాని మోదీతో పుతిన్ చర్చించారు. ఈ ఆర్గనైజేషన్లో భారత్ సహా పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్కు సభ్యత్వం ఉంది.

బుజ్జగింపులు..
కాగా- ఉక్రెయిన్పై అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణిని ప్రయోగించడానికి రష్యా సంసిద్ధంగా ఉందంటూ వార్తలు వెలువడిన రెండో రోజే పుతిన్.. ప్రధాని మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అణ్వాయుధాలను ప్రయోగించడానికి పుతిన్ సంసిద్ధతను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనను కలుసువడానికి మోదీ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనితో మోదీని బుజ్జగించడానికి పుతిన్ ఈ ఫోన్ కాల్ చేశారనే వాదనలు కూడా లేకపోలేదు.

46 వేల టన్నుల బరువు
ఉక్రెయిన్పై ప్రయోగించడానికి రష్యా తాజాగా సిద్ధం చేస్తోన్నట్లుగా చెబుతోన్న ఈ అణు క్షిపణి బరువు 46,000 టన్నులు. దీని రేంజ్ 12,000 కిలోమీటర్లు. అమెరికా లేదా యూరపియన్ యూనియన్లో గల అన్ని దేశాలు ఈ క్షిపని పరిధిలోకి వస్తాయి. 12,000 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఇది ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. దీని పేలోడ్ 500 కిలో టన్నులు. 500 కిలోల టన్నుల బరువును మోసుకెళ్లగలదు.












Click it and Unblock the Notifications