కొచ్చి ఎయిర్ పోర్టులో తృప్తి దేశాయ్ ను అడ్డుకున్న నిరసనకారులు: మేము చూస్తాం, అయ్యప్ప!
తిరువనంతపురం: శబరిమల దర్శనానికి బయలుదేరిన సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ ను శుక్రవారం వేకువ జామున కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిరసనకారులు అడ్డుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ గేట్ బయట హిందూ సంఘ, సంస్థలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తృప్తి దేశాయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.
పూణె టూ కొచ్చి
పూణే నుంచి ఆరు మంది మహిళలతో కలిసి తృప్తి దేశాయ్ కొచ్చి బయలుదేరారు. తృప్తి దేశాయ్ శబరిమల దర్శనానికి వస్తున్నారని పసిగట్టిన హిందూ సంఘ, సంస్థలు భారీ సంఖ్యలో ముందుగానే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రం చేరుకున్నారు.
పోలీసులు ఎంట్రీ
శుక్రవారం వేకువ జామున 4. 40 గంటల సమయంలో తృప్తి దేశాయ్ కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం బయట ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ఉండటంతో తృప్తి దేశాయ్ బయటకు వెళ్లడానికి వీలులేకుండా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
ట్యాక్సీ డ్రైవర్లు మద్దతు
విమానాశ్రయం వద్ద ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు సైతం మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లం అంటూ తృప్తి దేశాయ్ కు వ్యతిరకంగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లో తృప్తి దేశాయ్ ను విమానాశ్రయం నుంచి బయటకురానివ్వం అంటూ ఆందోళనకారులు తేల్చి చెప్పారు.
వెనక్కి వెళ్లను
తృప్తి దేశాయ్ కి, ఆందోళనకారులకు నచ్చచెప్పడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోకుండా తను మహారాష్ట్ర తిరిగివెళ్లను అని తృప్తి దేశాయ్ తేల్చి చెప్పారు.
ప్రభుత్వంపై నమ్మకం
తృప్తి దేశాయ్ ఎయిర్ పోర్టు నుంచి ఎలా బయటకు వస్తారో మేము చూస్తాం అంటూ ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందనే నమ్మకం తనకు ఉందని తృప్తి దేశాయ్ అన్నారు.
మండల పూజ
మండల పూజ నిమిత్తం శుక్రవారం సాయంత్రం అయ్యప్పస్వామి ఆలయం తెరుచుకోనుంది. తృప్తి దేశాయ్ తాను కచ్చితంగా శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుంటానని తేల్చి చెప్పడం, ఎయిర్ పోర్టు బయట ఆందోళనకారులు గుమికూడటంతో కేరళ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.