మకర జ్యోతి దర్శనం.. శబరిమల ఆలయానికి పోటెత్తిన అయ్యప్పస్వాములు.. భారీ భద్రత
స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో కేరళలోని శబరిమల కొడలు మారుమోగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మకర జ్యోతి దర్శనం (మకరవిలక్కు) సందర్భంగా భక్తులు పోటెత్తారు. సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమివ్వబోతున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అయ్యప్ప మాలధారులతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి.

ఇవాళ జరిగే వేడుక ఇదే..
మకరవిలక్కు వేడుకల్లో భాగంగా.. అయ్యప్ప స్వామి బాల్యం గడిపిన పండలం నుంచి దేవాలయానికి తిరువాభరణాలను ఊరేగింపుగా తీసుకొస్తారు. పవిత్ర 18 మెట్ల మీదుగా వాటిని సన్నిధానానికి చేర్చి, స్వామివారిని అలంకరిస్తారు. ఆ తర్వాత మహా దీపారాధన చేసి హారతి ఇచ్చే సమయంలోనే.. ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పొన్నాంబలమేడు పర్వతాలపై మకర జ్యోతి దర్శనమిస్తుంది. దీన్ని దర్శించుకోడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తుంటారు.

భద్రత కట్టుదిట్టం..
శబరిమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పంబానదితో పాటు సన్నిధానం, హిల్టాప్, టోల్ప్లాజా సమీపంలోనూ అదనపు బలగాలను మోహరింపజేశారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం దాదాపు 1500 మంది పోలీసులు పనిచేస్తున్నారని, వారిలో 15 మంది డీఎస్పీలు, 36 మంది సీఐలు ఉన్నారని, 70 మంది సభ్యుల బాంబ్ స్క్వాడ్ తోపాటు ఎన్ డీఆర్ఎఫ్, ఆర్ఆర్ఎఫ్ టీమ్ లూ రెడీగా ఉంటాయని ఆలయ నిర్వాహకులైన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

మరో ఐదు రోజులూ..
మకర జ్యోతి దర్శనం(మకరు విలక్కు) తర్వాత మరో ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు కొనసాగుతాయని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత శబరిమలలో అప్పుడప్పుడూ ఉద్రిక్తత నెలకోంటుండటం, మకర జ్యోతికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తడతో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications