విద్యుత్ లేని గ్రామాల్లో వెలుగులు నింపడమే నా రెండో ఇన్నింగ్స్: సచిన్
న్యూఢిల్లీ: విద్యుత్ లేని గ్రామాల్లో వెలుగులు నింపడమే తన రెండో ఇన్నింగ్స్ అని స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్యూలో రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. వివరాల్లోకి వెళితే... భారతదేశంలో ఇప్పటి వరకూ విద్యుత్ సదుపాయం లేని గ్రామాల్లో వెలుగులు నింపడమే తన రెండో ఇన్నింగ్స్ను కేటాయిస్తానని చెప్పారు.
దీనిని సాధించడానికి చాలా మంది సహకారం కావాలని, ప్రతి ఒక్కరూ తోడ్పాడతారని అశిస్తున్నట్లు సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్లోని పుత్తంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇటీవలే ఆ గ్రామాన్ని సందర్శించిన సచిన్ పలు కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన విషయం తెలిసిందే.
గ్రామానికి చేరుకున్న సచిన్ పైలాన్ ఆవిష్కరించారు. చేపల చెరువులో చేపలు వదిలి మీనోత్సవం ప్రారంభించారు. గోమాతకు పూజలు చేశారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. పాఠశాలలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు. గ్రామస్థులతో కలిసి స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారితో స్వచ్ఛ భారత్ కోసం ప్రమాణం చేయించారు.
తన అభివృద్ధి కార్యక్రమాలు తొలి ఇన్నింగ్స్ అయితే, దానిని గ్రామస్థులు నిలబెట్టుకోవడాన్ని రెండో ఇన్నింగ్స్గా అభివర్ణించారు. కోకోలు శివయ్య పిల్లల చదువు ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. కంపోస్టు యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. సచిన్ రూ.2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన విషయం తెలిసిందే.
ఆస్టేలియాలో ఆస్టేలియాపై ఆడటం చాలా కష్టమని సచిన్ టెండూల్కర్ అన్నారు. ఆస్టేలియాలో క్రికెట్ ఆడటం జీవితానికే భిన్నంగా ఉంటుంది. ఆటగాళ్లు, మీడియా, గ్రౌండ్మెన్, ప్రతి ఒక్కరి అభినందనలు మీ జీవితాన్ని ఎంతో భిన్నంగా మారుస్తాయని సచిన్ పేర్కొన్నాడు.
ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆరు ప్రపంచ్ కప్లు ఆడారు. అంతేకాకుండా 2011 ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తుకుని సగర్వంగా నిలిచారు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్కి సచిన్ టెండూల్కర్ను బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ ప్రకటించింది. వరుసగా రెండు సార్లు ఓ అంతర్జాతీయ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ను ఎన్నిక చేయడం విశేషం.