ఇంకా పెరిగిన బలం.. కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిదన్నది దాదాపు తేలిపోయింది. ఎలక్షన్ రేసులో విన్నరెవరో, రన్నరెవరో స్పష్టత వచ్చేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. 2014తో పోలిస్తే బీజేపీ బలం మరింత పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల కన్నా ఈసారి ఆ పార్టీకి సీట్లు పెరిగాయి.
మోడీ , షాల స్వరాష్ట్రం అయిన గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ ... అన్ని స్థానాల్లోనూ ఆధిక్యం
పెరిగిన బీజేపీ బలం
2014లో మోడీ ఛరిష్మాతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేసింది. మోడీ పనితీరుపై సంతృప్తితో ఉన్న ఓటర్లు మరోసారి ఆయనకు పట్టం కట్టాలని నిర్ణయించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 గెల్చుకుంది. నోట్ల రద్దు, జీఎస్టీ, ఈసారి సంఖ్యాబలం తగ్గుతుందన్న వాదనలు వినిపించాయి. అయితే ఆ అభిప్రాయాలను తలకిందులు చేస్తూ బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ను సాధించడమే కాకుండా గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లను అకౌంట్లో వేసుకుంది. ఈసారి ఆ పార్టీ దాదాపు 295కి పైగా స్థానాల్లో విజయం సాధించింది.
బెంగాల్, ఒడిశాలో
బెంగాల్లో మొత్తం 42 స్థానాలుండగా గత ఎన్నికల్లో మమత బెనర్జీ హవా కొనసాగింది. అయితే ఈసారి మాత్రం దీదీ ఇలాకాలో బలం పుంజుకున్న బీజేపీ దాదపు 18సీట్ల వరకు తన ఖాతాలో వేసుకోనుంది. ఒడిశాలో గతసారి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ ఈసారి 9 సీట్లలో సత్తా చాటుతోంది. కర్నాటకలో అందరూ ఊహించినట్లుగానే 28సీట్లకుగానూ 23 సీట్లలో కమలం పార్టీ ఆధిక్యం కొనసాగించింది. యూపీలో ఎస్పీ బీఎస్పీ మహాకూటమి ప్రభావంతో బీజేపీ చతికిల పడుతుందన్న అభిప్రాయాలు తలకిందులయ్యాయి. గతంలో పోలిస్తే సంఖ్య తగ్గినా ఈసారి బీజేపీ 50కిపైగా స్థానాల్లో పాగా వేసింది.
కాంగ్రెస్పాలిత ప్రాంతాల్లో బీజేపీ హవా
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చిన ఓటర్లు లోక్సభ ఎన్నికల వచ్చే సరికి రూటు మార్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మెజార్టీ స్థానంలో కమలం పార్టీ ముందంజలో ఉంది. చత్తీస్గఢ్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో జతకట్టిన కమలదళం రాష్ట్రంలో పార్టీ బలాన్ని మరింత పెంచుకుంది.