సెల్యూట్ అంబులెన్స్ డ్రైవర్: తల్లి చనిపోయిందని తెలిసినా.. డ్యూటీ చేసి...
అసలే కరోనా కాలం.. అంతా స్వార్థమే. పక్కవారి గురించి పట్టించుకోవడం లేదు. ఇక మంచి చెడుల సంగతి దేవుడెరుగు. ఇక ప్రంట్ లైన్ వారియర్స్ గురించి చెప్పక్కర్లేదు. అయితే అంబులెన్స్ డ్రైవర్లు/ వైద్యారోగ్య సిబ్బంది పాత్ర కీలకం. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో ఓ అంబులెన్స్ డ్రైవర్ తన విధుల పట్ల చూపిన అంకిత భావానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
తల్లి మరణవార్త తెలిసినా డ్యూటీ పూర్తి చేశాకే ఇంటికి వెళ్లాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. బాధను దిగమింగుకుని 15 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రికి చేర్చాడు ఆయన. ఆగ్రాకు చెందిన ప్రభాత్ యాదవ్ గత తొమ్మిదేళ్లుగా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన నైట్ డ్యూటీలో ఉండగా తల్లి చనిపోయినట్టు అతనికి సమాచారం వచ్చింది. అప్పటికి అతను తన డ్యూటీ షిఫ్ట్ మధ్యలో ఉన్నాడు. కోవిడ్ రోగుల నుంచి వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వెళ్లడం మంచిది కాదనుకొని.. డ్యూటీ పూర్తి చేశారు.
అలా ఆ రాత్రంతా డ్యూటీ చేసి 15 మంది పేషెంట్స్ను హాస్పిటల్కు చేర్చాడు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి బయల్దేరాడు. తన గ్రామానికి వెళ్లి తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి 24 గంటల్లో వెనక్కి తిరిగి వెళ్లి విధుల్లో జాయిన్ అయిపోయాడు. ఇంటికి వెళ్లడమే కాదు.. మళ్లీ తిరిగి విధుల్లో చేరాడు ఆయన. ఆయన అంకితభావం మిగతావారికి ఆదర్శంగా నిలిచారు.