బీజేపీ సంపర్క్ ఫర్ సమర్థన్: అగర్తాల మేయర్ను కలిసిన త్రిపుర సీఎం
న్యూఢిల్లీ: 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సంపర్క్ ఫర్ సమర్థన్ అనే ప్రచారాన్ని చేపట్టింది. తమకు మద్దతివ్వాలంటూ బీజేపీ అగ్రనేతలు మొదలు పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా పలువురిని కలుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పథకాలకు మద్దతివ్వాలని కోరుతున్నారు. నాలుగేళ్ల మోడీ పాలన-అభివృద్ధికి సంబంధించిన పుస్తకాన్ని కూడా పలువురు బహూకరిస్తున్నారు.
- సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ అగర్తాల మేయర్ డాక్టర్ ప్రఫుల్ జిత్ సిన్హాను (11-06-2018) కలిశారు. అలాగే కిక్ బాక్సర్ నిష్ట చక్రబర్తిని కూడా కలిశారు.
- సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా విజయ్ గోయెల్ జామా మసీద్ షాహీ ఇమామ్ను ఆదివారం (09-06-2018) కలిశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాదులో క్రీడాప్రముఖులను కలిశారు. సానియా మీర్జా, వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్ తదితరులను కలిశారు.
- బాబా రామ్ దేవ్ను కూడా అంతకుముందు అమిత్ షా కలిశారు. తమిళనాడు రాష్ట్రాలకు ఇంచార్జిగా ఉన్న మురళీధరరావు అక్కడి సినీ ప్రముఖులను కలుస్తున్నారు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిని బీజేపీ నేతలు కలిశారు.
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రముఖ ఫిలిం నటుడు, స్క్రీన్ రైటర్ సలీమ్ ఖాన్ను కలిశారు. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు.
- సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం (09-06-2018) బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను కలిశారు.
- సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా అమిత్ షా నాలుగైదు రోజుల క్రితం ముంబైలో సినీ నటి మాధురీ దీక్షిత్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, సింగర్ లతా మంగేష్కర్లను కలిశారు.