సంజయ్ గాంధీని అపార్థం చేసుకున్నారు: ప్రణబ్
న్యూఢిల్లీ: పీవీ నర్సింహా రావు, రాజీవ్ గాంధీ పైన ఆసక్తికర అంశాలను తన పుస్తకంలో వెల్లడించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... సంజయ్ గాంధీ, ఢిల్లీ అల్లర్ల పైన కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆయన పుస్తకంలోని అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్ పార్టీతో సంబంధంలేదని పేర్కొన్నారు. ఆ అల్లర్లు కొందరు దుండగుల పని అని ప్రస్తావించారు. రాజ్యంగేతరశక్తిగా ముద్రపడిన ఇందిర కుమారుడు సంజయ్ గాంధీని అందరూ అపార్థం చేసుకున్నారన్నారు.
1984లో ఇందిర గాంధీని సిక్కు భద్రతా సిబ్బంది కాల్చి చంపిన దరిమిలా ఢిల్లీలో పెద్ద ఎత్తున సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఇందిర దారుణ హత్యతో తీవ్రశోకంలో ప్రజలున్న సమయంలో దుండగులు రెచ్చిపోయి అల్లర్లకు తెగబడ్డారని, ఇళ్లు, దుకాణాలు లూటీచేస్తూ అమాయక సిక్కుల్ని ఊచకోత కోశారని పేర్కొన్నారు.
సంజయ్ గాంధీ విషయానికి వస్తే... ఎమర్జెన్సీ తర్వాత అతనిని విలన్గా చూపడం పరిపాటి అయిందన్నారు. అసలు మంచి అన్నదే లేని దుర్మార్గునిగా సంజయ్ గాంధీ పైన విషం కక్కారన్నారు. జనతా పార్టీ ఆవిర్భావం కలిగించిన ఉత్సాహం, ఇందిర వ్యతిరేక ప్రభంజనం, కాంగ్రెస్ చీలిక ఇవన్నీ దీనికి కారణమన్నారు.
1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి రావడం వెనుక సంజయ్ గాంధీ కృషి ఉందన్నారు. ఎమర్జెన్సీ వల్ల అధికారాన్ని కోల్పోయిన ఇందిరా గాంధీని తిరిగి గద్దెనెక్కించడంలో సంజయ్ గాంధీది కీలక పాత్ర అన్నారు. సంజయ్ ఆకర్షణ గల నాయకుడని, యువతతో కలిసిపోయేవారన్నారు. ఇందిర తిరిగి ప్రధాని చేపట్టిన కొన్నాళ్లకే సంజయ్ గాంధీ విమానప్రమాదంలో మరణించారు.