సంక్రాంతి అంటే ఏమిటి..? పండగ విశిష్టత ఏంటి..? దేశంలో ఎలా జరుపుకుంటారు..?
మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము. అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. ఉత్తర భారతంలో నివసించే హిందువులు, సిక్కులు సంక్రాంతి పండగను మాఘీ అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు. గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మకరసంక్రాంతిగా పిలుస్తారు. మధ్యభారత దేశంలో సుకరాత్ అని అస్సాంలో మఘ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. గుజరాత్లో గాలి పటాలను ఎగురవేస్తారు.
ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయాని విశ్వసిస్తారు. ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది. బెల్లం, లడ్డూలను తయారు చేసి ఇరుగుపొరుగువారికి పంచుతారు. విబేధాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని, సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది. హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళతారని చెబుతారు.