'శశికళ ఎన్నిక చెల్లదు!.. ఆ మాట వినకే జయలలిత అలా అయిపోయారు'
చెన్నై: ప్రధాన కార్యదర్శిగా పార్టీని చేజిక్కించుకున్న శశికళ.. అనుకున్నట్లుగా సీఎం మాత్రం కాలేకపోయారు. అయితే పార్టీ పగ్గాలు మాత్రం చేతిలోనే ఉండటంతో.. తన అనుయాయిలతో ప్రభుత్వాన్ని సైతం గుప్పిట్లో పెట్టుకుని తన కనుసన్నుల్లో నడిపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ పదవి ఊడిపోతే గనుక.. ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. తాజాగా అన్నాడీఎంకె పార్టీ మాజీ న్యాయ సలహాదారు, సీనియర్ న్యాయవాది జ్యోతి.. శశికళ పదవి ఊడిపోతుందని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని వ్యాఖ్యానించారు.
పార్టీ తీసుకున్న క్రమశిక్షణ చర్య నుంచి శశికళ తప్పించుకోగలిగినా.. అంతకుముందు పార్టీ సభ్యురాలిగా ఆమె గడిపిన రోజులు రద్దయినట్లేనని అభిప్రాయపడ్డారు.
శశికళ సంతకం చెల్లదు:
పార్టీలో ఆమె మళ్లీ సభ్యురాలిగా చేరి.. ఐదేళ్ల పాటు కొనసాగితేనే ప్రధాన కార్యదర్శి పోటీకి అర్హులవుతారని అన్నారు. ఈ లెక్కన ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం, ఆమె తీసుకున్న నిర్ణయాలు చెల్లవని జ్యోతి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను అన్నాడీఎంకె రెండాకుల చిహ్నాం, శశికళ సంతకం చట్ట ప్రకారం చెల్లవని తెలిపారు.
చిహ్నాన్ని రద్దు చేసే అవకాశం:
కేటాయింపు చట్టాన్ని ధిక్కరించి రెండాకుల చిహ్నాన్ని కేటాయించిన పక్షంలో.. ఆ చిహ్నాన్ని రద్దు చేసే అవకాశముందన్నారు. దీనిపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నెరవేర్చేందుకు సర్వసభ్య సమావేశం ద్వారా ఒకరిని ఎన్నుకుని, అతని నియామకాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదిస్తే బీఫారంలో ప్రధాన కార్యదర్శి సంతకం పనికి వస్తుందని పేర్కొన్నారు.
ఆ మాట వినకే.. జయకు ఆ పరిస్థితి
గతాన్ని ప్రస్తావిస్తూ.. అప్పట్లో జయలలిత తనకు ప్రాధాన్యతనివ్వడం శశికళకు నచ్చలేదని జ్యోతి అన్నారు. శశికళ, ఆమె వర్గానికి ఏం కావాలో ఇచ్చేసి పంపించేయండి, మీ వద్దే పెట్టుకోవద్దని జయలలితతో తాను చెప్పినట్లు జ్యోతి పేర్కొన్నారు. అయితే తన మాటను జయలలిత పట్టించుకోకపోవడం వల్లే తనను కాపాడుకోలేకపోయారని అన్నారు.
శశికళే ప్రధాన కార్యదర్శి.. ఈసీ జోక్యం చెల్లదు:
అన్నాడీఎంకె మాజీ సలహాదారు జ్యోతి వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ నవనీతకృష్ణన్ పరోక్షంగా తిప్పికొట్టారు. పార్టీ సర్వ సభ్య సమావేశంలో శశికళను ప్రధానకార్యదర్శిగా ఎన్నుకున్నందునా.. ఆ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎన్నికల కమిషన్ కు లేదని ఆమె అన్నారు.
ప్రధాన కార్యదర్శిగా ఎంపికవడం పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఎన్నికల కమిషన్ లేదా న్యాయస్థానం జోక్యం చేసుకునే హక్కు లేదని ఆమె తెలిపారు.