నన్ను తొలగించే అధికారం శశికళకు ఎక్కడిది?: పన్నీరు సంచలనం
అన్నాడీఎంకే ట్రెజరర్ పదవి నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తనను తొలగించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే ట్రెజరర్ పదవి నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తనను తొలగించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి తనను తొలగించే అధికారం ఆమెకు ఎక్కడిదంటూ మండిపడ్డారు. తన తొలగింపునకు డీఎంకే కారణమని చెప్పడం సరికాదన్నారు.
తను తదుపరి తీసుకునే చర్యలు అన్నాడీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. పదేళ్ల క్రితం అమ్మ(దివంగత సీఎం జయలలిత) తనకు ఇచ్చిన పార్టీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అమ్మ ఆశయాల కోసమే తాను పార్టీ ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతానని స్పష్టం చేశారు.
అంతేగాక, తాను పార్టీని వీడేది లేదని, కొన్ని గంటల్లోనే తానేంటో నిరూపిస్తానని హెచ్చరించారు. మంగళవారం రాత్రి జయ సమాధి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న ఆయనను కలుసుకునేందుకు సీనియర్ ఎంపీ మైత్రేయన్, శాసనసభ స్పీకర్ ధన్పాల్ తదితరులతోపాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ తనను ద్రోహి అన్న శశికళ వర్గంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎదురుపడితే నవ్వడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు.
శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్న పన్నీర్ సెల్వం తనకు మద్దతు తెలుపుతున్న 62 మంది ఎమ్మెల్యేలతో నేడు(బుధవారం) ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని గంటల్లో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లను కలిసి మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి వినతిపత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుత అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అధికశాతం మంది శశికళ వర్గీయులు కావడంతో పన్నీర్కు వారు మద్దతు ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ నేపథ్యంలో ఆయన డీఎంకే మద్దతు ఆసక్తికరంగా మారింది.
ఎన్నో అవమానాలు
‘అమ్మ' సూచన మేరకు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తనను శశికళ, ఆమె వర్గం వారు నానా రకాలుగా అవమానించారని పన్నీర్ సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జయలలిత సమాధి వద్ద దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు గడిపిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శశికళపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అడుగడుగునా అడ్డుతగిలారు..
సీఎం అయిన తాను పార్టీ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ప్రయత్నించానని, అయితే తన ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుతగిలారని పేర్కొన్నారు. ప్రతిసారి తన స్థాయిని తగ్గించాలని చూశారన్నారు.
రాజీనామాకు పట్టుబట్టారు..
ఆదివారం తనను పోయెస్గార్డెన్కు పిలిచారని, అప్పటికే అక్కడ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు. అక్కడికెళ్లిన తనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని శశికళ డిమాండ్ చేశారన్నారు.
ఫలితం లేకుండా పోయింది..
శశికళ వ్యాఖ్యలతో హతాశుడినైన తాను తనకు తెలియకుండా సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించానని నిలదీశానన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా ఒకరే ఉండాలని, కాబట్టి ఆమెను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నామని ఎమ్మెల్యేలు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని పన్నీర్ చెప్పుకొచ్చారు. వారితో రెండు గంటలపాటు వాదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
పార్టీ కోసమే అవమానాలు భరించా..
శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తనతో రాజీనామా చేయించడం సబబేనా అని ప్రశ్నించానని తెలిపారు. అయితే పార్టీ క్రమశిక్షణ కోసం అవమానాన్ని భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తమిళ ప్రజల కోసం..
జయ సమాధి వద్దకు వెళ్తానన్నా అనుమతించలేదన్నారు. తమిళనాడుకు తాను కాకపోయినా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడే వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకోసం ఒంటరిగానైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధమని పన్నీర్ సెల్వం ప్రకటించారు.