అమ్మ లాగే చిన్నమ్మ.. జైల్లో ఆధ్యాత్మిక జీవితం.. ప్రార్థనలు, ప్రదక్షిణలు
తెల్లవారుజామున 5గం.లకు నిద్ర లేస్తున్న శశికళ ఒక గంట పాటు తన సెల్ లోనే ధ్యానం చేస్తున్నారు.
చెన్నై: అనూహ్య పరిణామాల నడుమ జైలు జీవితం గడుపుతున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఇప్పుడిప్పుడే జైలు వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గతంలో అమ్మ అనుసరించిన ఆధ్యాత్మిక మార్గాన్నే శశికళ కూడా అనుసరిస్తుండటం విశేషం.
తెల్లవారుజామున 5గం.లకు నిద్ర లేస్తున్న శశికళ ఒక గంట పాటు తన సెల్ లోనే ధ్యానం చేస్తున్నారు. 6.30గం.కు వేడినీటితో స్నానం చేసి జైలు ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు. శశికళతో పాటు ఆమె మరదలు ఇళవరసి కూడా ఆలయ ప్రార్థనలో పాల్గొంటున్నారు.
కాగా, దివంగత సీఎం జయలలిత సైతం తన జైలు జీవితంలో ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపారు. ఆలయ ప్రాంగణంలో తులసి చెట్టు మండపాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యం ప్రార్థనలు చేసేవారు. ఇప్పుడదే మండపం వద్ద శశికళ కూడా పూజలు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఉదయం 6.30గం.కు స్నానం చేసిన తర్వాత శశికళ టిఫిన్ తీసుకుంటున్నారు.ఆ తర్వాత మధ్యాహ్నాం వరకు టీవి చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈమధ్యలో సందర్శకులెవరైనా వస్తే వారిని కలిసి మాట్లాడుతున్నారు. ఇక రాత్రి వేళలో 7.30కు జైల్లో పెట్టే ఆహారాన్ని తిని 10గం. తర్వాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
ఇదిలా ఉంటే, అక్రమాస్తుల కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న శశికళకు మరో ఆరు నెలలు గడిస్తే గానీ పెరోల్ లభించే అవకాశం లేదని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇక అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చట్ట విరుద్దంగా జరిగిందంటూ అందిన పిటిషన్ పై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్(ఈసీ) నోటీసులు జారిన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నోటీసులు శశికళకు అందినట్లు సమాచారం.