రాత్రి రిసార్టులోనే శశికళ బస: తీర్పుతో ఎదురుతిరిగితే, ఎవరు...
ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న శశికళ సోమవారం రాత్రంతా రిసార్డులోనే ఉన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునే ఉద్దేశంతో ఆమె అక్కడే బస చేశారు.
చెన్నై: ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న అన్నాడియంకె చీఫ్ శశికళ సోమవారం రాత్రి గోల్డెన్ బే రిసార్టులోనే బస చేశారు. సోమవారం సాయంత్రం ఆమె రిసార్టుకు వెళ్లారు. తన వెంట వైద్యులను కూడా తీసుకుని వెళ్లారు. గోల్డెన్ బే రిసార్టులో ఉన్న శాసనసభ్యులకు వైద్య పరీక్షలు చేయించారు.
మంగళవారం శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోయెస్ గార్డెన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు ఉంటున్న గోల్డెన్ బే రిసార్టు వద్ద కూడా పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు.
ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకెళ్లే అవకాశం ఉందనే సమాచారం రావడంతో శశికళ రిసార్టులోనే బస చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం ముగ్గురు ఎమ్మెల్యేలు అస్వస్థతకు గురయ్యారు. వారికి చికిత్స అందించేందుకు శశికళ విశ్వాసపాత్రులు కొంతమంది అంబులెన్సుల్లో వెళ్లారు.
తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే ఈ ముగ్గురు
సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తమ తరఫున ఎవరిని ముఖ్యమంత్రి చేస్తే మంచిదనే విషయంపై శశికళ ఎమ్మెల్యేల వద్ద ఆరా తీశారు. వారు సెంగోట్టయ్యన, ఎడప్పాడి పళనిస్వామి, తంబిదురై పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. ముగ్గురిలో ఎవరి పేరును ఖరారు చేయాలో శశికళ తన భర్త నటరాజన్తో మంతనాలు జరిపారు.
అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో - అంతా మంచి జరుగుతుందనే ఆశిద్దామని శశికళ వ్యాఖ్యానించారు. కూవత్తూరు రిసార్టులో ఆమె మీడియాతో మాట్లాడుతూ - తనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలంతా సంతోషంగానే ఉన్నారన్నారు. త్వరలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.
అలా జరిగితే పన్నీరు వైపు దూకే చాన్స్
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తమిళనాట రాజకీయాల్లో మార్పులు వేగంగా మారిపోతాయని పరిశీలకులు అంటున్నారు. తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఆమెకు ఎదురు ఉండకపోవచ్చని, పన్నీర్ సెల్వం వెంట ఉన్న ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా ఆమె శిబిరంలోకి వచ్చేయవచ్చని భావిస్తున్నారు.
తీర్పు ప్రతికూలంగా వస్తే..
తీర్పు ప్రతికూలంగా వస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ మరొకరిని ప్రకటించవచ్చని, ఆ వెంటనే ఆమె వెంట ఉన్న ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా పన్నీర్ సెల్వం శిబిరంలోకి దూకేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇప్పటికే 11 మంది ఎంపీలు సెల్వం శిబిరంలో ఉండగా, మరో ఐదుగురు ఎంపీలు ఆయన వెంట నడవడానికి సిద్ధపడ్డారు. సోమవారం రాత్రి మధురై ఎమ్మెల్యే శరవణన్, మధురై ఎంపీ గోపాలకృష్ణన్ పన్నీరు సెల్వం శిబిరానికి చేరారు. ఇదిలావుంటే, వారం రోజులుగా శశికళ శిబిరంలో ఉన్న ఆయన.. సోమవారం రాత్రి గోడ దూకి మరీ బయట పడ్డారు. అక్కడి నుంచి మారు వేషంలో సెల్వం గూటికి చేరుకున్నారు.