ఒకటి, రెండురోజుల్లో సమస్య పరిష్కారం కాదు, సుప్రీం మధ్యవర్తిత్వ సభ్యులతో షహీన్బాగ్ ఆందోళనకారులు
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ షహీన్బాగ్లో ఆందోళన చేస్తున్న వారితో సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ రెండోరోజు చర్చలు జరిగాయి. బుధవారం షహీన్బాగ్ వద్ద గల స్టేజీపై మధ్యవర్తత్వ కమిటీ సభ్యులు సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే, అద్వకేట్ సాధన రామచంద్రన్ చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు తమకు అప్పగించిన బాధ్యత గురించి వారికి వివరించారు.
సీఏఏ నిరసనలతో షహీన్బాగ్లో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పిటిషన్ దాఖలు చేయగా.. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీని సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. మొదటి రోజు మంగళవారం చర్చలు జరపగా.. రెండో రోజు కూడా వారి సమస్యలను అలకించారు. వారి సమస్యలను తమతో చెప్పారని.. ఒక్కరోజులో సమస్య పరిష్కారం కాదన్నారని సాధన రామచంద్రన్ తెలిపారు. తిరిగి తమను గురువారం రావాలని కోరడంతో వెనుదిరిగామని చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఇక్కడికొచ్చామని, ప్రతీ ఒక్కరితో మాట్లాడి సమస్యను తెలుసుకుంటామని సభ్యులు సంజయ్ హెగ్డే పేర్కొన్నారు. అందరి సహకారంతోనే సమస్య మూలాల్లోకి వెళ్లి సాల్వ్ చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ మీరు చేసే ఆందోళనతో ఇతరుల హక్కులకు భంగం కలిగొద్దు కదా అని గుర్తుచేశారు. మీ ఆందోళనతో రహదారులపై ఇతరులు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. మరికొందరు దుకాణాలు తెరవలేని సిచుయేషన్ ఉందని వివరించారు.
సీఏఏను నిరసిస్తూ షహీన్బాగ్లో ఆందోళన చేస్తున్న వారు ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఎంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ చోట కూడా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలుగొద్దని స్పష్టంచేసింది. సీఏఏను నిరసిస్తూ వేలాదిమంది ఆందోళన చేయడంతో.. ప్రజలు ఇబ్బందిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.